గుంటూరు జిల్లాలో సీబీఐ ప్రకంపనలు:253మందిపై కేసులు
గుంటూరు:ఫేక్ డాక్యుమెంట్స్, బినామీ పేర్లతో ఐడీబీఐ బ్యాంకుకు భారీగా టోకరా వేసిన అక్రమార్కుల వ్యవహారం గుంటూరు జిల్లా బాపట్లలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
2010 సంవత్సరంలో వెలుగు చూసిన ఈ స్కాములో సీబీఐ అధికారులు గుంటూరు జిల్లా,విశాఖపట్నం, హైదరాబాద్ ల్లో కుంభకోణాలకు సంబంధించి ప్రధాన నిందితులతోపాటు మరో 253 మందిని నిందితులుగా తేల్చారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురూ గుంటూరు జిల్లా బాపట్లకు చెందినవారే కావడం గమనార్హం. తాజాగా సీబీఐ అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేయడం బాపట్లలో కలకలం రేపుతోంది.
2010-12 మధ్యకాలంలో గుంటూరు ఐడిబిఐ బ్యాంకు ఎజిఎం హరీశ్ చెరువుల్లో చేపల పెంపకం అంటూ 105 మందికి రూ.23.29కోట్ల రుణాలు అందించారు. అయితే అక్కడ చెరువులూ లేవు, చేపలూ లేవంటూ ఫిర్యాదు అందడంతో సిబిఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో హరీశ్తో పాటు మాదా శ్రీనివాసరావు, మాదా సుబ్రహ్మణ్యం, గుండూరి మల్లికార్జునరావు కూడా కీలక పాత్ర పోషించారని గుర్తించి వారిపై విశాఖపట్నం సిబిఐ కోర్టులో శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో బ్యాంకుకు రూ.47.39 కోట్ల నష్టం వాటిల్లిందని అందులో పేర్కొంది.
నకిలీ పత్రాలు, బినామీ పేర్లతో ఐడీబీఐ బ్యాంకుకు టోకరా పెట్టిన స్కామ్ లో ప్రధాన నిందితులు గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు బాపట్లకు చెందినవారే. ఈ కేసులో బినామీలుగా ఉన్న 253 మంది కూడా బాపట్లకు చెందిన వారు కావడం, సీబీఐ అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులోమొత్తం 253 మంది నిందితుల నుంచి వారి నుంచి అసలు, వడ్డీ కలిపి రూ.141.12 కోట్లు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితులు గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు, ఐడీబీఐ బ్యాంకు అప్పటి మేనేజర్ హరీష్ను ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధాన నిందితులను అరెస్టు కావడంతో ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న నిందితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కువ మంది చిన్న, సన్నకారురైతులు, వ్యవసాయకూలీలే. పనికి వెళ్లకపోతే పూటగడవని కూలీలను కూడా బినామీలుగా చూపటం, వారు జైలుకు వెళ్లే పరిస్థితి రావడం చర్చనీయాంశంగా మారింది.