అలా చేస్తే మరో 20ఏళ్లు పడుతుంది.. ఆధారాలు ఉంటే బయటపెట్టండి: చంద్రబాబు
కేసును సీబీఐకి అప్పగిస్తే.. విచారణకే మరో 20ఏళ్లు పడుతుందని అన్నారు. అలా కాకుండా 'ఆధారాలేమైనా ఉంటే తీసుకురండి.. చర్యలు తీసుకుంటాం' అంటూ సీఎం వ్యాఖ్యానించారు.
అమరావతి: విశాఖ భూఆక్రమణల వ్యవహారాన్ని సీబీఐతో విచారించాలని ప్రతిపక్షం వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు సొంతగూటి నుంచే భూఆక్రమణలపై విమర్శలు రావడంతో.. టీడీపీ సైతం తొలుత దీనిపై బహిరంగ విచారణకు సిద్దమంటూ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా బహిరంగ విచారణ చేయిస్తామని హామి ఇచ్చారు.
కానీ ఇంతలోనే బహిరంగ విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం 'సిట్'తో విచారణ షురూ చేయించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై స్పందించారు. విశాఖ భూఆక్రమణల కేసును సీబీఐకి అప్పగిస్తే.. విచారణకే మరో 20ఏళ్లు పడుతుందని అన్నారు. అలా కాకుండా 'ఆధారాలేమైనా ఉంటే తీసుకురండి.. చర్యలు తీసుకుంటాం' అంటూ సీఎం వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం ఇలా స్పందించారు. మీ కేబినెట్ లోని మంత్రి గంటా శ్రీనివాసరావే సీబీఐ విచారణ కోరారు కదా.. అన్న మీడియా ప్రశ్నకు చంద్రబాబు ఇలా బదులిచ్చారు. అదే సమయంలో ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూఆక్రమణలకు సంబంధించి.. ఎవరి వద్ద ఎలాంటి ఆధారాలున్నా వెంటనే బయటపెట్టాలని అన్నారు.
ఇక ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో 24ప్రాజెక్టులను వచ్చే మార్చి లోపు పూర్తి చేస్తామని తెలిపారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రతిపక్షం విమర్శలకు బెదిరిపోయి ఉంటే గోదావరి నీళ్లకు కృష్ణాకు తీసుకొచ్చి ఉండేవాళ్లం కాదన్నారు. పులించింతల ప్రాజెక్టును అగస్టులో జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. ఇక కైజాలా యాప్ ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించి.. ఎవరైతే మంచి ఫోటోలు పంపిస్తారో.. వారికి ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని తెలియజేశారు.