సీమలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్: ఇద్దరి లక్ష్యం ఒక్కటే
రాయలసీమ కేంద్రంగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం కర్నూలు వస్తున్నారు. ఇప్పటికే కడపలో పర్యటన పూర్తి చేసిన పవన్ చిత్తూరు జిల్లాలో పర్యటనకు రానున్నారు. ఇద్దరు నేతలు..రెండు పార్టీలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పటు చేసుకుంటున్నా..వారిద్దరి లక్ష్యం మాత్రం ఒక్కరే.
చంద్రబాబు తన పర్యటనలో ప్రధానంగా వైసీపీ బాధిత కుటుంబాల పరామర్శతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయటం లక్ష్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ పార్టీ నేతలతో సమీక్షలతో పాటుగా..తెలుగు భాషా పరిరక్షణపై సాహితీ వేత్తలు, భాషాకోవిదులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. దీంతో..సీమ వేదికగా ముఖ్యమంత్రి జగన్ పాలన లక్ష్యంగానే వారు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.
కర్నూలు జిల్లాలో చంద్రబాబు
టీడీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం కర్నూలుకు చేరుకుంటున్నారు. ఆయన జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం కర్నూలుకు చేరుకునే చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమీక్షలు నిర్వహిస్తారు. రెండో రోజున ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నియోజకవర్గాలు, మూడో రోజున బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమౌతారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా వైసీపీ నాయకుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న, అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న టీడీపీ కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా కలుసుకుంటారు.
తిరుపతిలో పవన్ కళ్యాన్..
ఇక, ఇప్పటికే రాయలసీమలో పర్యటన ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత ఓ ప్రైవేట్ హోటల్లో లోక్సభల వారీగా పార్టీ నేతలతో ఇవాళ చర్చలు జరపనున్న పవన్... సీమ జిల్లాల్లో పార్టీ అవలంభించాల్సిన విధివిధానాలపై దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ తిరుపతి వేదికగా.. తెలుగు భాషా పరిరక్షణపై సాహితీ వేత్తలు, భాషాకోవిదులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. మాతృభాష పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అవలంభించాల్సిన విధానాలు, అమ్మభాషను కాపాడుకోవటానికి ఏర్పాటు చేసుకోవాల్సిన లక్ష్యాలపై జనసేన అధినేత చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలతో భేటీ కానున్నారు. రాత్రికి నగరంలోని వైద్యులతో సమావేశం కానున్నారు.
ఇద్దరి లక్ష్యం సీఎం జగన్...
ఇప్పటికే ఇద్దరు నేతలు జగన్ ఆరు నెలల పాలన మీద విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీల కార్యకర్తల మీద దాడులు పెరిగాయని ఆరోపిస్తున్నారు. ఇసుక అంశం మీద ఒకరికి ఒకరు మద్దతు ప్రకటించారు. ఒక పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో మరో పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇక, ఇంగ్లీషు మీడియం పాఠశాలల అమలు విషయంలోనూ చంద్రబాబు చెప్పిన అంశాల నే పవన్ మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది. కడప..కర్నూలు జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. చంద్రబాబు..బాలక్రిష్ణ..పయ్యావుల కేశవ్ మాత్రమే టీడీపీ నుండి గెలుపొందారు. జనసేనకు ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. ఇక, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో..చంద్రబాబు పూర్తిగా నష్టపోయిన కర్నూలు జిల్లాలో పార్టీలో తిరిగి జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.