అసెంబ్లీ టీడీపీ వాదన..వ్యూహం ఇదే: ఆ ఎమ్మెల్యేలపైనే అనుమానం: మండలిపైనే ఆశలు..!
అసెంబ్లీలో రాజధాని అంశం పైన తమ విధానంపైన టీడీపీ ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు కీలక సూచనలు చేసారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఏ రకంగా రాజధాని అంశం మీద ముందకొచ్చేదీ స్పష్టత లేకపోవటంతో టీడీపీ కొంత డైలమాలో కనిపిస్తోంది. ప్రభుత్వం బిల్లు రూపంలో వస్తుందా..లేక తీర్మానం ప్రతిపాదిస్తుందా..సీఆర్డీఏ చట్టం పైన ద్రవ్య బిల్లు సభలో ప్రవేశ పెడుతుందా అనే దాని పైన చర్చ సాగింది. ప్రభుత్వం ముందున్న అవకాశాలు ఏంటి.. ఏ మార్గంలో వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలనే దాని పైన సుదీర్ఘంగా చర్చించారు. అయితే పార్టీ తరపున వాదన ల్లో మాత్రం ఒకే మాట నినాదం వినిపించాలని డిసైడ్ అయ్యారు. తమకు శాసనసభలో సరైన అవకాశాలు రాకపోయినా..మండలిలో ప్రతిఘటిస్తామనే ధీమా టీడీపీ వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో విశాఖ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల తీరు పైన సొంత పార్టీలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
టీడీపీ వ్యూహం..వాదన ఇదే..
ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో బలంగా తమ వాదన వినిపించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలు ఇదే వాణిని వినిపించాలని డిసైడ్ అయింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి వైసీపీ ప్రభుత్వం ముందుకు తెచ్చే ప్రతిపాదనలను గట్టిగా వ్యతిరేకించాలని, తమ వ్యతిరేకతను బలంగా నమోదు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. న్యాయపరంగా వచ్చే అడ్డంకులను అధిగమించడానికి ప్రభుత్వం నేరుగా రాజధాని మార్పును ప్రస్తావించకపోవచ్చని, ప్రాంతాల అభివృద్ధి పేరుతో రాష్ట్రం నలుమూలలా జోనల్ కార్యాలయాల ఏర్పాటు ప్రతిపాదన చేసే అవకాశం ఉందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయ పడ్డారు. కోర్టులకు భయపడే ఇప్పుడు దొడ్డిదారులు వెతుకుతున్నారని..ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉన్నా..సంయమనం..సమ న్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
మండలి పైనే ఆశలు..
శాసనసభలో ఏ రకంగా ప్రభుత్వం బిల్లులు ప్రతిపాదించేదీ.. ఏ అంశం పేరుతో చర్చకు వచ్చేదీ కేబినెట్ లో నిర్ణయం తరువాత మాత్రమే స్పష్టత రానుంది. అధికారికంగా శాసనసభా బీఏసీ సమావేశంలోనే టీడీపీకి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, బిల్లు పైన అధ్యయనానికి సమయం ఇవ్వకుండా ఒకే రోజులో ప్రతిపాదన..ఆమోదం పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నిర్ణయించింది. అయితే, తాము ఏ రకంగా అభ్యంతరం చెప్పినా శాసనసభలో వైసీపీకి ఉన్న బలం కారణంగా..ప్రభుత్వం అనుకున్న విధంగానే ముందుకెళ్లే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. దీంతో..మండలిలో మాత్రం తమకు ఉన్న బలం కారణంగా..అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసి శాసన మండలిలో వ్యూహాన్ని నిర్ణయించుకోవాలని నిశ్చయించారు.
సభ్యుల గైర్హాజరు పైన టెన్షన్..
టీడీపీలో ఇప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వ వ్యూహం ఏ రకంగా ఎదుర్కోవాలనే ఆలోచన చేస్తున్న సమయంలోనే..తమ సభ్యులు కొందరి తీరు పైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. మరో ముగ్గురు రాకపోయినా..వారు సమాచారం ఇచ్చారు. అయితే, ఈ ఇద్దరు సైతం తమతోనే ఉంటారని..పార్టీ విధానం మేరకే నడుచుకుంటారని ధీమాగా చెబుతున్నా..లోలోపల మాత్రం అనుమానంతోనే ఉన్నారు. ఇక, ఇదే సమయంలో మండలిలోని కొందరు టీడీపీ సభ్యులతో వైసీపీ టచ్ లో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో..తాము మండలిలో బిల్లు అడ్డుకుంటామని ధీమాగా చెబుతున్న టీడీపీ..ఏ సభ్యుడు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే, టీడీపీ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది సభలోనే తేలాల్సి ఉంది.