వైయస్సార్ భయపడి వెనుకడుగు..అభినందించాలి: జగన్ అహంకారంతో..ఇలా: చంద్రబాబు ఫైర్..!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ తీరు మీద మండిపడ్డారు. అయిదు నెలల పాలనలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసారంటూ ఫైర్ అయ్యారు. ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలమైందని..నీళ్లు పుష్కలంగా వచ్చినా విద్యుత్ సమస్య పరిష్కారంలో చేతులెత్తేసిందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాల పరీక్షా పత్రం లీక్ చేసారని..కొన్ని సంస్థలకు దీనిని చేర్చారంటూ ఆరోపణలు గుప్పించారు. డీజీపీ తీరు పైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక, మీడియా నియంత్రణ కోసం గతంలో వైయస్సార్ హాయంలో జీవో తీసుకొస్తే..తాము చేసిన ఆందోళనతో నాడు వైయస్సార్ భయపడి వెనుకడుగు వేసారని..ఇప్పుడు జగన్ అదే జీవోకు మరిన్ని అధికారాలు జోడించి మీడియా స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారుల సంఘం నేతుల మీసం మెలేసి మాట్లాడటం పైన చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. సిట్.. ఎస్పీలను తరచూ ఎందుకు మారుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆమంచి సోదరుడు..కోటంరెడ్డి లాంటి వారు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే డీజీపీకి పట్టదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
వైయస్ వెనుకడుగు వేసారు..అభినందించాలి..
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 ఫిబ్రవరి 20న జీవో నెంబర్ 938 ద్వారా మీడియా మీద ఆంక్షల దిశగా నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. అయితే, జర్నలిస్టు సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలు..ప్రతిపక్ష నేతగా తాను చేసిన పోరటానికి భయపడి నాడు వైయస్సార్ వెనుకడుగు వేసి..ఆ జీవోను రద్దు చేసారని చంద్రబాబు వివరించారు. ఇందు కోసం వైయస్సార్ ను అభినందించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు జగన్ అదే జీవోను తిరిగి అమల్లోకి తెస్తూ దీనికి తోడు మరిన్ని నిర్ణయాలను జోడించారని చెప్పుకొచ్చారు. మీడియా మీద ఎందుకు అంత అసహనం అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
డీజీపీకి ఇవన్నీ కనిపించవా..
నెల్లూరులో కోటంరెడ్డి జర్నలిస్టుల మీద..చీరాల మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఒక పోలీసు ఉద్యోగి పైన ఇష్టానుసారం మాట్లాడితే వారి పైన చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. డీజీపీ ఉండేది నాలుగు లేదా అయిదు నెలలేనని..ఈ విధంగా వ్యవహరించటం సరి కాదన్నారు. పోలీసు అధికారుల సంఘం నేతలు వివేకా హత్య కేసు గురించి ప్రశ్నిస్తే మీసం మెలేసి వర్ల రామయ్యకు వార్నింగ్ ఇస్తారా అని ప్రశ్నించారు. మరి..ఆమంచి సోదరుడు పోలీసు ఉద్యోగి మీద అసభ్యంగా మాట్లాడితే ఎందుకు స్పందించలేదని నిలదీసారు. ఇదే మైనా పోలీసు రాజ్యమా.. వీరికి అధికారం ఎవరిచ్చారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. తూర్పు గోదావరిలో ఒక జర్నలిస్టును హత్య చేస్తే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారని చెప్పుకొచ్చారు.
అయుదు నెలల్లో ఎన్నో అరాచకాలు..
ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత అయిదు నెలల కాలంలో ఎన్ని అరాచకాలు చేయాలో ముఖ్యమంత్రి జగన్ అన్నీ చేసారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలమైందని.. ఫలితంగా 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసారు. మద్యం వ్యాపారుల నుండి జే టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయ పరీక్షల్లో ప్రశ్నాపత్రం టైప్ చేసిన అభ్యర్దికే మొదటి ర్యాంకు వచ్చిదంటూ ఆరోపించారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసారని..అయిదు నెలల్లో ఎక్కడా తట్టెడు మట్టి వేయలేదని విమర్శించారు. రాజకీయ దాడులు ఎక్కవయ్యాయని చెప్పుకొచ్చారు. మీడియా స్వేచ్చ గురించి మంత్రి నంగి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు.