చంద్రబాబు పై స్పీకర్ సీరియస్: ప్రతిపక్ష నేత సస్పెన్షన్ కు డిమాండ్: అసెంబ్లీలో రగడ..!
Recommended Video
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా వాతావరణం హీటెక్కింది. ఇంగ్లీషు మీడియం పాఠశాలల నిర్ణయం పైన ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన ముఖ్యమంత్రి విమర్శలు చేసారు. ఆ తరువాత చెవిరెడ్డి భాస్కర రెడ్డి తాను ఎంఫిల్ చేసానని..చంద్రబాబు 50 ఏళ్లుగా ఎంఫిల్ చేస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ తరువాత గురువారం ఇదే అంశం పైన చర్చ ఉండటంతో ఇక దీనిని ముగించాలని ముఖ్యమంత్రి..మంత్రి బుగ్గన కోరారు. అయితే, చంద్రబాబు మరోసారి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ..స్పీకర్ మీద చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చంద్రబాబు తనను బెదిరించేలా మాట్లాడటం సరి కాదని మండిపడ్డారు. వెంటనే వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలని సూచించారు. చంద్రబాబు సైతం గట్టిగా స్పందించారు. దీంతో..వైసీపీ నేతలంతా స్పీకర్ ను అగౌరపరిచిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.
ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు మద్దతు..
ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల పైన సభ్యులు మాట్లాడారు. టీడీపీ నుండి ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియంకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. అదే సమయంలో తెలుగును సైతం కాపాడాలని కోరారు. ఇక, తన ఇంగ్లీషు మీద వైసీపీ సభ్యులు చేసిన కామెంట్ల పైన సీరియస్ అయ్యారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ చంద్రబాబు హాయంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలలు తీసుకొద్దామనుకున్నామని చెబుతున్నారని..ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇదే అంశం పైన గురువారం చర్చ ఉండటంతో దీని పైన చర్చ ముగించాలని కోరారు. స్పీకర్ సైతం దీని పైన చర్చ ఇక అవసరం లేదని చెప్పారు. దీంతో..చంద్రబాబు ఒక్కసారిగా ఆవేశంగా స్పందించారు.
స్పీకర్ వర్సెస్ చంద్రబాబు
దీంతో..మరోసారి మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆ సమయంతో అవకాశం ఇవ్వకపోవటంతో స్పీకర్ ఛైర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఒక్కసారిగా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబును మాట వెనక్కు తీసుకోవాలని సూచించారు. ఆ తరువాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలిగించారు. ఆ వెంటనే వైసీపీ సభ్యులు ఒక్క సారిగా సీరియస్ అయ్యారు. స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా..చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు వాదనకు దిగారు. తమకు అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆ సమయంలో స్పీకర్.. చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
చంద్రబాబును సస్పెండ్ చేయాలి..
దీంతో..వైసీపీ నుండి పలువురు సభ్యులు స్పందించారు. స్పీకర్ ఛైర్ మీద అనుచిత వ్యాఖ్యలతో అగౌరవంగా వ్యవహరించిన చంద్రబాబును సభ నుండి సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు..మంత్రి అనిల్ ,, మేరుగ నాగార్జునతో సహా జనసేన సభ్యుడు రాపాక వర ప్రసాద్..జోగి రమేష్ తో పాటుగా పలువురు సభ్యులు చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్ పైన అనుచితంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు పైన చర్యలు తీసుకున్న తరువాతనే సభ సాగాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేసారు. వైసీపీ సభ్యుడు అప్పలరాజు సైతం స్పందించారు. ఇది మానసిక జబ్బు అని.. వైద్యులకు చూపించాలని కోరారు.