పవన్..బీజేపీని ఫిక్స్ చేస్తున్నారా: చంద్రబాబు వ్యూహం అదేనా : పార్టీ తాజా నిర్ణయం వెనుక..!
ఏపీలో తమ మాజీ మిత్రులు ఒక్కటవ్వటం పైన టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2014 తమతో కలిసిని జనసేన..బీజేపీ ఇప్పుడు టీడీపీని పక్కన పెట్టి..ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. టీడీపీతో తమకు ఎటువంటి పొత్తులు ఉండవని బీజేపీ తేల్చి చెప్పింది. జనసేన సైతం టీడీపీతో పాటుగా వామపక్షాలతోనూ సంబంధాలు కొనసాగించటానికి వీళ్లేదనే కండీషన్ స్పష్టం చేసింది. దీనికి జనసేన అధినేత..బీజేపీ ఒకే నిర్ణయానికి వచ్చారు.
అయినా..టీడీపీ ఇప్పుడు ఈ పొత్తు పైన చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వ్యూహాన్ని బయట పెడుతున్నాయి. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం తప్పుకాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. అయితే, ముందుగా అమరావతి అంశానికి ప్రాధాన్యత ఇస్తున్న టీడీపీ..ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈ రెండు పార్డీలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా.. చంద్రబాబు తో సహా పార్టీ సీనియర్ నేత పయ్యావు ల కేశవ్ చేసిన వ్యాఖ్యలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా అమరావతి అంశంలో తమదే పైచేయి అయ్యేలా అడుగులు వేస్తోంది.
బీజేపీ..జనసేన పొత్తుపై..
ఏపీలో బీజేపీ జనసేన పొత్తు పైన వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ నిర్ణయించింది .దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు వ్యతిరేక కామెంట్లు రాలేదు. తాజాగా..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం తప్పుకాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ఈ పొత్తు కారణంగా జగన్ కే నష్టమనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తం అవుతోంది.
తాము బలపడేందుకు అధికారంలో ఉన్న జగన్ ను బీజేపీ టార్గెట్ చేసే అవకాశం ఉందని.. అది పరోక్షంగా కేసుల విషయంలోనూ ప్రభావితం అవుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అమరావతి విషయం పైన జనసేన..బీజేపీ సైతం మద్దతుగా నిలవటంతో వారి ద్వారా జగన్ పైన ఒత్తిడి పెంచటం పైన ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తోంది.
చంద్రబాబు వ్యాఖ్యల పరమార్ధం..
చంద్రబాబు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటం తప్పు కాదని వ్యాఖ్యానిస్తూనే..కొనసాగింపుగా మరి కొన్ని వ్యాఖ్యలు చేసారు. అందులో ప్రధానంగా...ఆ రెండు పార్టీలు రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అడ్డుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ బోగస్ కమిటీల నివేదికలతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి పైన నిర్ణయం ఆధారంగానే బీజేపీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని టీడీపీ సీనియర్ నేత చేసన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అమరావతి పైన నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా మౌన దీక్ష సైతం చేసారు. అదే విధంగా అమరావతి రైతులకు అండగా నిలుస్తామని పవన్ సైతం ప్రకటించారు. దీంతో..ఇప్పుడు వీరిద్దరి మీద ఒత్తడి తెచ్చి..అటు పరోక్షంగా కేంద్రం ద్వారా అమరావతి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ప్రయత్నం చేయాలని టీడీపీ భావిస్తోంది.
ఆ క్రెడిట్ తమకే దక్కేలా..
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా..అమరావతిని తరలిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా..అది అమలైనట్లు కాదని..దీని మీద తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసారు. దాదాపు ఇదే అభిప్రా యంతో పవన్ సైతం ఏకీభవించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత తన కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ స్పష్టం చేసారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన మీద అమరావతిని కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ టీడీపీ నేతలు ఆ రెండు పార్టీలను అమరావతి ప్రజల విషయంలో ఫిక్స్ చేస్తున్నారు.
దీని ద్వారా ఆ రెండు పార్టీల మీద రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నారు. అది ఫలించి..అమరావతి తరలింపు ఆగితే తమకే ప్రయోజనమని..సాధ్య పడకపోతే..రాజకీయంగా అమరావతి కోసం పోరాడిన పార్టీకి తమకే మైలేజ్ వస్తుందని టీడీపీ అంచనా. ఇదే సమయంలో రాయలసీమలో హైకోర్టు కారణంగా తమకు ప్రయోజనం లేదనే భావనలో అక్కడి ప్రజలు ఉన్నారని..అదే విధంగా విశాఖ ప్రజలు సైతం రాజధాని కోసం అంత ఆసక్తిగా లేరనేది టీడీపీ అభిప్రాయం. దీంతో..ఇప్పుడు అసెంబ్లీ లో నిర్ణయం..ఆ తరువాత రాజకీయ పార్టీల అడుగులు రాజకీయంగా కీలక సమీకరణాలకు నాందిగా మారే అవకాశం ఉంది.