సీఎం మంచి ఉద్దేశంతో బిల్లు తెచ్చారు: మా మద్దతుంటుంది..ఆచరణలో జాగ్రత్త: సభలో చంద్రబాబు..!
ఏపీ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ను అభినందించారు. ఆయన మంచి ఉద్దేశంతో బిల్లును తెచ్చారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొన్ని సూచనలు చేసారు. ఇక, ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నట్లుగా వారి అఫిడవిట్లులో స్పష్టం చేసారని ఆరోపించారు. దీని మీద వైసీపీ నేతలు స్పందిస్తూ..టీడీపీ నేతల మీద ఉన్న కేసుల గురించి ప్రస్తావించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తాజాగా చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
సీఎం మంచి ఉద్దేశంతో బిల్లు తెచ్చారు..
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ-2019 బిల్లు పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో మాట్లాడారు. ఈ సమయంలో బిల్లును ముఖ్యమంత్రి సదుద్దేశంతో ప్రవేశ పెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తక్షణ న్యాయం అనే అంశం పైన తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని సభలో ప్రకటించారు.
ఈ చట్టం అమలు సమయంలో దేశంలో ఉన్న చట్టాలు.. కేంద్రం అమలు చేస్తున్న చట్టాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని..ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈ బిల్లు అమలయ్యేలా చూడాలని సూచించారు. అమలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన చేసారు. బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో ఉన్న ఉత్సాహం..అమలులోనూ ఉండాలని వ్యాఖ్యానించారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కేంద్రం సైతం ఆమోదం తెలిపేలా చూడాలని చంద్రబాబు కోరారు.
వైసీపీ నేతల మీద కేసులు
ఇదే సందర్భంలో వైసీపీ నేతల మీద ఉన్న కేసుల విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీనికి వైసీపీ నేతలు ప్రతిస్పందించారు. దేశంలో మహిళల పైన దాడులు చేసిన వారి పైన నమోదైన కేసుల్లో దేశంలో బీజేపీ నేతలు 21 మంది.. కాంగ్రెస్ నుండి 16 మంది..వైసీపీ నుండి ఏడుగురు ఉన్నారని వివరించారు. అందులో ముగ్గరు ఎంపీలు ఉండగా..ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారని లెక్కలు చెప్పుకొచ్చారు.
సీఎం చెప్పినట్లు నిర్ధారిత ఆరోపణలు ఉంటే వెంటనే శిక్ష పడాలనే ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నానని స్పష్టం చేసారు. అదే సమయంలో నిర్దోషులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని సూచించారు. దీని పైన ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే నిర్దోషులు సైతం శిక్షలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేసారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందనగా వైసీపీ నేతలు వనజాక్షి విషయం.. ఐపీఎస్ అధికారిపైన దాడి వ్యవహారాల విషయంలో చంద్రబాబు పైన విమర్శలు చేసారు.
చంద్రబాబు హాయంలో ఇద్దరు మంత్రులపైనా
చంద్రబాబు వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి స్పందించారు. ఇప్పుడు లెక్కలు చెబుతున్న చంద్రబాబు..ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే ఏడీఆర్ నివేదిక మంత్రులు అచ్చెన్నాయుడు.. దేవినేని ఉమా పేర్లు ప్రస్తావించిందని గుర్తు చేసారు. అప్పుడు చంద్రబాబు ఏం చేసారని ప్రశ్నించారు. అయితే ,దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ..అసలు పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని.. తాను ఏదైనా చేసానని చెబితే కోర్టులో సవాల్ చేయవచ్చని సూచించారు.