హవ్వ! ఆడవాళ్లు దుస్తులు మార్చుకునే చోట...సిసి కెమేరా?...అదీ ఆలయ ప్రాంగణంలో:దుమారం
విజయవాడ:ఇంద్రకీలాద్రి అధికారుల అతిభద్రతా చర్యలో...అత్యుత్సాహమో తెలియదు కానీ...వారి చేసిన ఒక పనికి అమ్మవారి మహిళా భక్తులు బెంబేలెత్తిపోయారు. వారు అంతలా భయపడిపోవడానికి కారణం ఒక సిసి కెమేరా...వివరాల్లోకి వెళితే...
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న సి.వి.రెడ్డి చారిటీస్ ట్రస్ట్ డార్మిటరీలో అధికారులు ఒక సీసీ కెమెరా ఏర్పాటుచేశారు. అయితే ఇక్కడ సిసి కెమేరా ఏర్పాటు చేయడంపై వివాదం రేగింది. ఆడవాళ్లు దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరా ఏర్పాటు చేయడం ఏంటంటూ భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ వసతి గృహాన్ని సాధారణంగా పెళ్లి బృందాలకు ఎక్కువగా ఇస్తుంటారు. దీంతో ఇక్కడే పెళ్లికూతురు సహా అందరూ రెడీ అవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి చోట సీసీ కెమెరా పెట్టడం...అది కూడా తేలిగ్గా గుర్తించలేని విధంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఇదే విషయమై భక్తులు అధికారులను నిలదీస్తే...వారు పొంతలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో భక్తుల ఆగ్రహం మరింత రాజుకుంది.
ఆ కెమెరా ఎందుకు పెట్టారంటే...ఆ ప్రశ్నకు బదులు ఇవ్వకుండా ఆ కెమెరా పెట్టి కేవలం మూడు రోజులు మాత్రమే అయిందని, అయినా అది అప్పటి నుంచి పనిచేయడం లేదని సెక్యూరిటీ వాళ్లు చెబుతున్నారట. ఆలయ అధికారులయితే ఇంకా కెమెరాలకు కనెక్షన్స్ ఇవ్వలేదని అంటున్నారట. కనెక్షన్ ఇవ్వకపోయినా, అవి పనిచేయకపోయినా అసలు ఆడవాళ్లు దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?...ఎవరికి వచ్చిందంటూ భక్తులు నిలదీస్తుండటంతో దుమారం రేగుతోంది.