బాబు భద్రత కోసం కరకట్టపై సిసి కెమెరాలు, అమరావతి వచ్చేస్తా: పరిటాల సునీత
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడ దగ్గరలో ఉన్న కృష్ణా నది కరకట్టపై సీసీ కెమెరాలు దర్శనమివ్వనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెజవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై సమీక్ష చేసిన పోలీసు బాసులు కరకట్ట పైన సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కృష్ణా కరకట్టలపై లింగమనేని గ్రూప్ నిర్మించిన అధునాతన గెస్ట్ హౌస్ను చంద్రబాబు తన తాత్కాలిక నివాసంగా మార్చుకున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉంటున్నారు. చంద్రబాబు కరకట్ట పై నుంచే విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు భద్రతపై సమీక్షించిన పోలీసులు, కరకట్టపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నెలాఖరులో రాజధాని ప్రాంతంలో ఉంటా: పరిటాల సునీత
ఈ నెలాఖరులోగా రాజధాని ప్రాంతంలో నివాసం ఉండి, ఇక్కడి నుంచే పాలన సాగిస్తానని ఏపీ మంత్రి పరిటాల సునీత మంగళవారం అన్నారు. ఐజేఎం విల్లాస్లో మంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సునీత మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధికి సహకరించకుండా రాద్దాంతం చేయవద్దన్నారు.
కాగా, ఇప్పటికే సీఎం చంద్రబాబు తన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా హైదరాబాదు నుంచే పాలనా వ్యవహరాలను కొనసాగించేందుకు ఇష్టపడని చంద్రబాబు విజయవాడలో వేగంగా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఆ తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులు కూడా తమ కార్యాలయాలను విజయవాడ తరలించుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు శాఖలకు సంబందించిన మెజారిటీ కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచి సాగుతున్నాయి.
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు కూడా ఇదే బాటలో వడివడిగా అడుగులేస్తున్నారు. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కూడా తన కార్యాలయాన్ని హైదరాబాదు నుంచి విజయవాడకు తరలించే పనిలో పడ్డారు. రెయిన్ ట్రీలోని భవనాల్లోనే ఆమె తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.