శేషాచలంలో రహస్య కెమెరాలు: ఫుటేజీతోనే హతం
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలను తెలుసుకునేందు పోలీసులు శేషాచలం అడవుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఆధారంగానే పోలీసులు స్మగ్లర్లపై దాడులు చేసి వారి ఆటకట్టిస్తున్నారు. మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ కూడా సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగానే జరిగినట్లు తెలుస్తోంది.
గత వారం రోజులుగా శేషాచలం అడవుల్లోకి సుమారు ఐదు వందలమంది ఎర్రచందనం స్మగ్లర్లు ప్రవేశించినట్లుగా ఈ వీడియో ఫుటేజీ ద్వారానే పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు నిఘాను పెంచారు. ఫుటేజీ ఆధారంగా ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కడెక్కడ మోహరించారనే అంశంపై నిర్ధారణకు వచ్చారు. పక్కా సమాచారంతో, పకడ్బందీగా అడుగులు వేశారు.
సోమవారం రాత్రి స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆగమేఘాలపై అడవుల్లోకి ప్రవేశించి... మంగళవారం తెల్లవారక ముందే ఎర్రచందనం తరలించే స్మగ్లర్ల ఆట కట్టించారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నాలుగు నెలల కిందట 12 రహస్య కెమెరాలను శేషాచలం అడవుల్లో అక్కడక్కడా అమర్చారు. బాలపల్లి, కుక్కలదొడ్డి, చామల, రంగంపేట ప్రాంతాల్లో అడవంచు దారుల్లో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు ఎర్ర స్మగ్లర్ల కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నాయి.

రాత్రి పూట దృశ్యాలను కూడా చిత్రీకరించగల ఈ కెమెరాలను రూ.20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన అమర్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం ఎర్రచందనం దుంగలను మోసుకెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆదివారం మధ్యాహ్నం ఎర్ర దొంగలు అడవిలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
చివరికి ఎన్కౌంటర్ సంఘటనకు సరిగ్గా రెండు గంటల ముందు కూడా ఎర్ర చందనం స్మగ్లర్లు అడవుల్లో సంచరిస్తున్నట్లు కనిపించింది. ఈ రహస్య కెమెరాల సాయంతోనే మంగళవారం పోలీసులు 20 మంది ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications