ఏపీలో మరో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక- ఆగస్టు 24న పోలింగ్... వైసీపీ ఖాతాలోకే...
ఏపీలో మరో ఎమ్మెల్సీ స్ధానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న రెండు స్ధానాల్లో ఒక దానికి మాత్రమే పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నిక నిర్వహణ కోసం ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 13 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువిస్తారు. ఆగస్టు 24న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.
మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలతో రెండు ఎమ్మెల్సీ స్ధానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో మోపిదేవి రాజీనామా చేసిన స్ధానానికి ఏడాదికి పైగా పదవీకాలం ఉంది. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన స్ధానానికి మాత్రం ఆరునెలల్లో గడువు తీరిపోనుంది.
ఆరునెలల లోపు గడువు మాత్రమే ఉన్న స్ధానాలకు సహజంగా ఉప ఎన్నికలు నిర్వహించరు. దీంతో మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఎలాగో ఆరు నెలల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ చేసిన స్ధానం గడువు పూర్తయ్యాక ఒకేసారి ఈ ఎన్నిక నిర్వహిస్తారు.
వాస్తవానికి ఈ రెండు స్ధానాలు ఎమ్మెల్యే కోటా స్ధానాలే కావడం, రాజీనామాలు చేసిన వారు కూడా వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ రెండు స్ధానాలూ ఎలాగో వైసీపీ ఖాతాలోకే చేరతాయి. అంతే కాదు ఇప్పటికే ఖాళీ అయిన స్ధానాలతో పాటు రాబోయే ఎమ్మెల్యే కోటా ఖాళీలను కూడా వైసీపీ అనాయాసంగా తమ ఖాతాలోకి వేసుకోనుంది.