ఏపీలో మరోసారి..అయిదు చోట్ల : చంద్రగిరి నియోజకవర్గంలో : 19న రీపోలింగ్..ఎందుకంటే...!
ఏపీలో మరోసారి రీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం లోని అయిదు పోలింగ్ బూత్ల్లో రీ పోలింగ్కు జిల్లా అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. దీని పైన ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 19వ తేదీన రీపోలింగ్ జరగనుంది.
ఏపీలో మరోసారి రీపోలింగ్..
ఏపీలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చాయి. ఈ ఫిర్యాదులు..ఆరోపణల ఆధారంగా జిల్లా కలెక్టర్ల నుండి రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నివేదిక కోరారు. దీనికి అనుగుణంగా వచ్చిన నివేదికలను పరిగణ లోకి తీసుకొని ఈనెల 6వ తేదీన అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించారు. ఇక, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలోని పలు పోలింగ్ బూత్లలో రీ పోలింగ్ నిర్వహించాలని కొద్ది రోజులుగా టీడీపీ..వైసీపీ పరస్పరం ఒకరి మీద మరొకరు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసారు. దీని పైన విచారణ చేయించిన సీఈవో అయదు కేంద్రాల్లో రీ పోలింగ్కు సిఫార్సు చేసారు. దీనికి అనుగుణంగా ఈ నెల19వ తేదీన చంద్రగిరి నియోజకవర్గంలోని అయిదు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగనుంది.
చంద్రగిరి నియోకవర్గంలోని వీటిల్లో..
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అయిదు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగనుంది. లోక్సభ తో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గానికి రీ పోలింగ్ నిర్వహించనున్నారు. నియోకవర్గ పరిధిలోని ఎన్నార్ కమ్మపల్లిలోని 321 పోలింగ్ బూత్, పులివర్తిపల్లి లోని 104 పోలింగ్ బూత్, కొత్త కండ్రీగ లోని 316 పోలింగ్ సెంటర్, కమ్మపల్లిలోని 318 పోలింగ్ బూత్, వెంకట్రామ పురంలోని 313 పోలింగ్ బూత్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. దేవ వ్యాప్తంగా చివరి దశ ఎన్నికలు జరిగే రోజున ఇక్కడ కూడా రీ పోలింగ్ కు అదేశించారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రీ పోలింగ్ జరగనుంది.
రెండు పార్టీల వివాదం..
చంద్రగిరిలో అభ్యర్దులు ఖరారైన సమయం నుండి టీడీపీ..వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. పోలింగ్ నాడు చెదురు మదురు ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. పోలింగ్ ముగిసిన తరువాత రీపోలింగ్ నిర్వహించాలంటూ కొన్ని ఘటనలను వివరిస్తూ టీడీపీ అభ్యర్ది నాని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి నివేదించారు. అదే విధంగా వైసీపీ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కరరెడ్డి సైతం సీఈవోను కలిసి టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేసారు. ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అదనపు సీఈవోను కలిసి చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 బూతులపై వచ్చిన ఫిర్యాదుపై సీఈవో విచారణకు ఎందుకు ఆదేశించారని అడిగారు. పోలింగ్ రోజున ఆ రెండు బూత్లపై టీడీపీ అభ్యర్థి నాని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు రీ పోలింగ్కు ఆదేశాలు రావటంతో వచ్చే ఆదివారం అక్కడ రీ పోలింగ్ జరగనుంది.