తెలంగాణ దెబ్బ!: ఏపీ వారికి శుభవార్త, తగ్గనున్న మొబైల్ ధరలు
విజయవాడ: ఏపీలో మొబైల్ వినియోగదారులకు శుభవార్త రాష్ట్రంలో ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. సెల్ ఫోన్ చార్జర్లు, బ్యాటరీలపై, స్టిల్ ఇమేజ్ వీడియో కెమెరా, బ్యాటరీ చార్జర్ల పైన ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 14.5 శాతం ఉన్న వ్యాట్ను 5 శాతానికి తగ్గిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో విభజన అనంతరం సెల్ ఫోన్ అమ్మకాలు పెద్దగా పెరగలేదు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో వాటి ధర ఎక్కువగా ఉంది. దీంతో, ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 14.5 శాతం వ్యాట్ విధించే వస్తువులన్నీ చట్టంలోని ఐదో షెడ్యూల్లో ఉన్నాయి. దీనిని ఇప్పుడు నాలుగో షెడ్యూల్లోకి తీసుకు రానున్నారు.
సగానికి పైగా కార్యాలయాలు తరలింపు
విజయవాడ, గుంటూరు నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఇప్పటి వరకు 50 శాతానికి పైగా శాఖాధిపతుల కార్యాలయాలు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లాయి. వెళ్లిన వాటిలో ఎక్కువ కార్యాలయాలు లాంఛనంగా నిర్దేశిత ముహూర్తానికి కొబ్బరికాయలు కొట్టినవే.
అక్కడ అద్దెకు తీసుకున్న భవనాలను తమ కార్యాలయాలకు అనువుగా మరమ్మతులు, మార్పు చేర్పులు చేయించుకుంటున్నారు. అవి పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టనుందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి 102 శాఖాధిపతుల కార్యాలయాలు వెళ్లవలసి ఉంది. గత నెల 29 నుంచి 54 కార్యాలయాలు వెళ్లగా, విడతలవారీగా 48 కార్యాలయాలు వెళ్లనున్నాయి.