పేలిన సెల్ఫోన్:బాలుడికి తృటిలో తప్పిన ముప్పు...పోలీసులకు ఫిర్యాదు
తిరుపతి:సెల్ ఫోన్ లు పేలిపోతున్న ఘటనలకు సంబంధించిన వార్తలు వినియోగదారులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పైగా వీటిలో అత్యధిక భాగం ఛార్జింగ్ పెట్టే క్రమంలో పేలుతుండటంతో ఛార్జింగ్ పెట్టేందుకు భయపడిపోతున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో సోమవారం ఓ బాలుడి చేతిలో సెల్ఫోన్ పేలింది. ఫోన్ ఛార్జింగ్లో ఉండగా ఫోన్ వెనుక భాగం నుంచి పొగలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన బాలుడు ఫోన్ను తీసుకొని దూరంగా విసిరేయడంతో పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయింది. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కొంచెం ఉంటే ఫోన్ బాలుడి చేతి లోనే పేలి ఉండేదని ఆందోళన వెలిబుచ్చారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు సదరు సెల్ ఫోన్ కంపెనీపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.