సెన్సార్ బోర్డులోకి జీవిత: అప్పుడేనా... బీజేపీ నేతలు అప్సెట్!
హైదరాబాద్: తెలుగు సినీ దర్శక నిర్మాత జీవితను సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా చేయడం పట్ల స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకింత అసంతృప్తితో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీవిత కొద్ది నెలల క్రితమే పార్టీలో చేరారని, పార్టీకి చేసిన సేవ కూడా కొద్దిగానేనని, ఇలాంటప్పుడు ఆమెకు ఇవ్వడమేమిటనే వ్యాఖ్యలు బీజేపీలో వినిపిస్తున్నాయని తెలుస్తోంది.
జీవిత గతంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో పని చేశారని, ఇటీవలనే ఆమె పార్టీలో చేరారని, అయినప్పటికీ ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు కట్టబెట్టారని, ఇప్పుడు సెన్సార్ బోర్డులోకి తీసుకోవడం సరికాదని లోలోపల అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
జీవితకి ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోందని చెవులు కొరుక్కుంటున్నారట. జీవిత కంటే చాలా సీనియర్లు, పార్టీ కోసం ఎంతో పని చేసిన వారు ఉన్నారని, అలాంటప్పుడు నిన్న గాక మొన్న వచ్చిన వారికి ఇవ్వడమేమిటనే అంటున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అంత యాక్టివ్గా పని చేయలేదని కూడా అంటున్నారని సమాచారం.
కాగా, సెన్సార్ బోర్డు కొత్త చైర్ పర్సన్గా పహ్లాజ్ నిహలానీని, తొమ్మిది మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డు చైర్ పర్సన్గా ఉన్న లీలా శ్యాంసన్, సభ్యులు గతవారం రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్ పర్సన్ను, సభ్యులను నియమించింది.
పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్లో నిర్మాతగా సుపరిచితులు. కాగా, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి జీవితను కూడా సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమించారు. సెన్సార్ బోర్డు సభ్యులుగా జీవితతో పాటు ఎస్ శేఖర్, అశోక్ పండిత్, సయ్యద్ బరీ, మిహిర్ భూటా, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, రమేష్ పతంగె, జార్జ్ బేకర్లు ఉన్నారు.