ఏపీ కేబినెట్ మంత్రులు అందరూ ఔట్-సీఎం జగన్ తేల్చి చెప్పారు : అంతా కొత్త వారే - బయటపెట్టిన సీనియర్ మంత్రి..!!
ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండున్నారేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలి సారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేసారు. పని తీరు ఆధారంగా 90 శాతం వరకు మంత్రులను తప్పించి..కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పటికే దాదాపుగా రెండేళ్లు పూర్తయి నాలుగు నెలలు అవుతుండటంతో కేబినెట్ విస్తరణ పైన చర్చ మొదలు అయింది. జగన్ సీనియర్లు వరకు మినహాయించి..మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతోంది.
సీఎం జగన్ లెక్క పక్కా
దీంతో పాటుగా పని తీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు.. విస్తరణలో ఔట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే, పూర్తిగా ప్రాంతీయ -సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్..ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తరువాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తం మంత్రులు అవుట్ - కొత్త వారికి ఛాన్స్
అయితే, రెండున్నారేళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్నా.. కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పని చేయలేకపోవటంతో మరో ఆరు నెలల పదవి పొడిగించి..మూడేళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయమూ పార్టీలో వినిపిస్తోంది. ఇక, ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు..కేబినెట్ లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన అంశం బయట పెట్టారు. మంత్రివర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేసారు. సీఎం తీసుకొనే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని..తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు.
సీనియర్లకు పార్టీ బాధ్యతలు
దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్ లో ఉన్న వారంతా సీనియర్లు..జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా, పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని..ఆ పదవులు పార్టీ కోసం పని చేసిన వారికి ఇవ్వాలంటూ రోజా..మల్లాది విష్ణు..జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది.
2024 ఎన్నికల టీం గా కొత్త మంత్రులు
వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సంసిద్దులను చేయటం కోసం ..పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించటం కోసం ప్రస్తుత మంత్రులకు విస్తరణ తరువాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసి మంత్రి పదవులు దక్కని వారు..పార్టీ-ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్ విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని... ఎన్నికలకు ముందే గ్రౌండ్ లోకి వెళ్లాని నిర్దేశించటం ద్వారా..సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్దం అవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది.
బాలినేని వ్యాఖ్యలతో జగన్ ఆలోచన పై క్లారిటీ
ఇక, ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి..సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పటం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటి దారి పట్టటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకొనేదెవరనే అంశం పైన అప్పుుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే, సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయట పెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావటంతో ఆచి తూచి ఎంపిక చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయటం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్ గా మారితే..ఆశావాహుల్లో మరింత ఆశలు పెంచుతోంది.