రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్...2010 నుంచి లెక్కలు చెప్పండి
అమరావతి:రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన లెక్కలపై ఆరా తీయిస్తున్న కేంద్రం తాజాగా ఎపి ప్రభుత్వం పై మరో అస్త్రం సంధించింది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు చెప్పాలని కాగ్ నుంచి ఎపి ప్రభుత్వానికి తాకీదు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖకు రెండు రోజుల క్రితం లేఖ అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి రాష్ట్రానికి తామిచ్చిన నిధుల గురించి వివిధ కోణాల్లో లెక్కలు రాబట్టేందుకు కేంద్రం పట్టుదలతో ఉందని స్పష్టమవుతోంది. తాజాగా అందిన లేఖ ప్రకారం ఎపి ప్రభుత్వాన్ని ఏకంగా 2010 నుంచి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు చెప్పాలని కాగ్ కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, ఆర్థిక సంఘంపై కేంద్రం చేస్తున్న పెత్తనంపై పలు రాష్ట్రాలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ వివరాలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్నిబట్టి కేంద్రం రాష్ట్రాల నిరసనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదనే అర్థం అవుతోంది. పైగా తాజాగా కాగ్ రాసిన లేఖలో సాధారణ వివరాలు కాకుండా లోతుగా అధ్యయనం చేసే విధంగా కేంద్రం ఇచ్చిన నిధులు, రుణాలు, వడ్డీ, ఖర్చుల వంటి అన్ని కోణాల్లోనూ నివేదికలు కోరుతుండటం గమనార్హం.
ఒకవైపు త్వరలోనే ప్రారంభం కానున్న 15వ ఆర్థిక సంఘం అమలు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక వివరాలను ఆర్థిక సంఘం ఇప్పటికే అడుగుతోంది. అయితే ఈ వివరాలు కాగ్ నుంచి తెప్పించుకోవాలని నిర్ణయిచినట్లు తాజా లేఖని బట్టి అర్థమవుతోంది. ఈ లేఖలో ప్రధానంగా కేంద్రం పరిధిలో ఉన్న 53 శాఖల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలు కోరినట్లు తెలిసింది. 2010-11 నురచి 2018-19 వరకు ఆయా శాఖల ద్వారా వచ్చిన నిధుల వివరాలు కాగ్ కు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులను మినహాయించి ఇతర నిధుల వివరాలు మాత్రమే చెప్పాలని కాగ్ ఇందులో కోరినట్లు తెలుస్తోంది.
2010-11 నుంచి 2016-17 వరకు వాస్తవ నిధుల వివరాలు, 2017-18 సవరణ అంచనాలు, 2018-19 బడ్జెట్ అంచనాల వివరాలు కూడా చెప్పాలని కాగ్ కోరడం గమనార్హం. అలాగే ఏ విభాగంలో నిధులు ఏ రంగం ద్వారా వచ్చాయి, తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ వివరాలు కూడా చెప్పాలని కాగ్ నిర్దేశించిందట. మరోవైపు ఆర్థిక సంఘం కూడా ఏయే ప్రాజెక్టులకు ఎంత రుణాలు తీసుకున్నారు, కేంద్రం ఎంత నిధులు సమకూర్చిందన్న వివరాలు కూడా స్పష్టంగా తెలియచెయ్యాలని కోరినట్లు తెలిసింది. తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఉన్న కాల పరిమితి, అందులో ఇప్పటివరకు చేసిన ఖర్చులను కూడా ఆర్థిక సంఘం కోరుతోంది. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టులు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలు కూడా చెప్పాలని స్పష్టం చేసిందని తెలిసింది.
ఇక ఇప్పటివరకు ఉన్న పద్దతికి భిన్నంగా కేంద్రం ఇస్తున్న ప్రకృతి వైపరీత్యాల నిధులపైనా ఆర్థిక సంఘం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జాతీయ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, రాష్ట్ర డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ల కిరద సమకూరిన నిధులు, చేసిన ఖర్చు వివరాలు చెప్పాలని నిర్దేశించిందట. దీని ప్రకారం చేసిన ఖర్చులో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎవరిది ఎంతన్నది కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. వీటిల్లోనూ వైపరీత్యాల వారీగా వివరాలు కోరుతోంది. భూకంపాలు, వరదలు, వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, హితపాతం వంటి వైపరీత్యాల్లో ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చులు చెప్పాలని, వీటికోసం ఇతర సంస్థల ద్వారా సమీకరించిన నిధుల వివరాలు కూడా వివరించాలని కోరుతోంది. ఈ వివరాలను కూడా 2010 నుంచి ఇవ్వాలని కోరడం విశేషం. ఈ వివరాలపై ఆర్ధిక సంఘం సమీక్షించి, కొత్త పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.