జగన్ సొంత జిల్లాలో రైల్వే ప్రాజెక్టుపై కేంద్రం మెలిక- సర్కారుపై సగం భారం- కాదనలేని పరిస్ధితి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుదిరిన పలు ఒప్పందాలను విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో అమలు చేయలేని పరిస్దితి ఉంది. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. విభజనతో నష్టపోయిన ఏపీ పాత ఒప్పందాల అమలు కష్టంగా మారింది. అయితే కేంద్రం మాత్రం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేసి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. ఇదే క్రమంలో సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కీలకమైన ఓ అంతర్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టు ఖర్చులో సగం మీరు భరించాల్సిందేనంటూ కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. 22 మంది ఎంపీలున్న వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లాలో ప్రాజెక్టు విషయంలోనూ ఏమీ చేయలేని పరిస్ధితి.
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు
ఏపీలోని రాయలసీమ జిల్లాలను కర్నాటకతో కలిపే కీలకమైన ప్రాజెక్టు కడప-బెంగళూరు రైల్వే లైన్. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రస్తుతం ఉన్న మార్గాలు సరిపోవడం లేదు. దీంతో కీలకమైన ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కడప నుంచి బెంగళూర్కు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి ఏపీలోనే ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ సహా అన్నీ సిద్ధమయ్యాయి. అయితే అదే సమయంలో రాష్ట్ర విభజన కారణంగా ఈ ప్రాజెక్టు మూలన పడింది. దీనికి పలు కారణాలున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చే పరిస్ధితి లేకపోవడంతో పాత ప్రాజెక్టుల దుమ్ము దులుపుతోంది. ఇందులో భాగంగా మరోసారి కడప-బెంగళూర్ రైల్వే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.
ఉమ్మడి ఏపీలో ఒప్పందం
కడప-బెంగళూరు మధ్య నిర్మించే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 వాటా భరించేలా గతంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2013లో ఈ రైల్వే ప్రాజెక్టుకు శంఖుస్ధాపన కూడా చేశారు. అప్పటి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణ కోసం భూసేకరణ చేయాల్సి రావడం, అందుకు కేంద్రం నుంచి అటవీ భూముల డీనోటిఫికేషన్ అవసరం కావడం వంటి సమస్యలతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. కానీ తాజాగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది.
జగన్ సర్కారుకు కేంద్రం మెలిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు నిర్మాణం అప్పుడే మొదలై ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఈ 50 శాతం వాటా భరించాల్సి రావడం కష్టసాధ్యంగా మారింది. దీంతో కేంద్రమే ఈ వాటా భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. తాజాగా కేంద్రం అటవీ భూముల డీనోటిఫికేషన్ కూడా చేసి సహకరిస్తామని హామీ ఇచ్చింది. అయితే నిర్మాణ వ్యయంతో 50 శాతం మాత్రం భరించాల్సిందే అంటోంది. దీంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్ధితి.
ఏపీ సర్కార్పై రూ.1500 కోట్ల భారం
కడప-బెంగళూర్ మధ్య రైల్వే ప్రాజెక్టులో భాగంగా 268 కిలోమీటర్ల రైల్వే బ్రాడ్ గేజ్ లైన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చవుతాయని గతంలో అంచనా వేశారు. కానీ తాజా లెక్కల ప్రకారం అది కాస్తా రూ.3 వేల కోట్లకు చేరింది. దీంతో 50-50 ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వం తమ వాటా కింద రూ.1500 కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్ధితి. ప్రస్తుతం ఏపీ ఆర్ధిక పరిస్ధితిని బట్టి చూస్తే ఒకే రైల్వే ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ఖర్చుపెట్టడం చాలా కష్టం. అయినా కేంద్రం మాత్రం భరించాల్సిందేనంటోంది. దీనిపై నిన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబ ఈ విషయం తేల్చిచెప్పేశారు.