జగన్ కు షాక్ .. ప్రత్యేక హోదా ముగిసిన అంశం; మరోమారు తేల్చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక కలలాగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తుంది. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్తుంది. ఏపీలో అధికారంలోకి వచ్చే ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ ప్రత్యేక హోదా . ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని, అది కేవలం వైసీపీ వల్లనే సాధ్యమని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రత్యేక హోదాపై ఇప్పటివరకు కేంద్రంపై బలంగా పోరాటం చెయ్యలేకపోయింది. కేంద్రం ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని పదేపదే తేల్చి చెప్తుంది. ఇక తాజాగా జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాలలో కూడా కేంద్రం మరోమారు ప్రత్యేక హోదా అంశంపై తమ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.
ప్రత్యేక హోదాపై ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని ఆయన ఆ సమాధానంలో పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను పూర్తి చేయడం కోసం, ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలతో పాటు, ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటివరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
విభజన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నాం
విభజన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని, అందువల్ల 2015-2016 నుండి 2019- 2020 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇవ్వడానికి అంగీకరించామని పేర్కొన్నారు. 2015-16 నుండి 2019 - 20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
లోక్ సభ వేదికగా మరోమారు ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రం
ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించి, ఇప్పటి వరకు విభజన చట్టంలో అనేక అంశాలు అమలయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన వాటికి కొంత సమయం ఉందని వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇక లోక్ సభ వేదికగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని, ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపించడం సమంజసం కాదని వైసీపీ ఎంపీలు తేల్చి చెబుతున్నారు.
Recommended Video
పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై మోడీ సర్కార్ ను టార్గెట్ చెయ్యనున్న వైసీపీ ఎంపీలు
శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కింద ఏయే ప్రయోజనాలు ఇస్తారో అవన్నీ ఏపీకి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
మోదీ సర్కారు ప్రత్యేక హోదా విషయంలో ఇరకాటంలో పెట్టాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన సదరన్ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదాపై పార్లమెంట్ వేదికగా మోదీ సర్కార్ పై ఒత్తిడి పెంచాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.