ఏపీ మాజీ ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్, జగన్ సర్కార్ సస్పెన్షన్కు ఓకే, చార్జిషీట్ ఫైల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్తో కేంద్రం ఏకీభవించింది. గత ప్రభుత్వ హయాంలో ఐబీ చీఫ్గా పనిచేసిన వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలు లభించినట్టు కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా తీర్పు వస్తోందని ఊహించిన వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది.
అక్రమాలు నిజమే..?
గత ప్రభుత్వ హయాంలో ఏరోశాట్, యూఏవీల కొనుగోల కోసం వెచ్చించిన రూ.25.5 కోట్లలో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆధారాలు సేకరించి.. చర్యలు తీసుకున్నది. వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పిస్తూ.. నిర్ణయం తీసుకున్నది. దీనిపై తాను న్యాయపరంగా పోరాడుతానని ఏబీవీ చెప్పగా.. కేంద్ర ప్రభుత్వం కూడా సస్పెన్షన్కు మద్దతు తెలిపింది. దీనిపై చార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టంచేసింది. వచ్చేనెల 7వ తేదీలోగా చార్జీసీట్ ఫైల్ చేయాలని లేఖలో పేర్కొన్నది.
ఇదీ కారణం..
అఖిల భారత ఉద్యోగుల సర్వీసుల నియమావళి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. అనంతరం బదిలీ చేసిన ప్రభుత్వం ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్గా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.
కుమారుడి కంపెనీకి..
ఏబీ వెంకటేశ్వర రావు పోస్టింగ్లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలను తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారంటూ విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో.. ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా ధృవీకరించడంతో.. ఏబీవీ విచారణను ఎదుర్కొనున్నారు.