పవన్కు షాకిచ్చిన బీజేపీ.. చంద్రబాబును చీల్చిచెండాడిన జీవీఎల్.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని, ఆమేరకు కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా చేస్తానని రాజధాని రైతులకు మాటిచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్కు బీజేపీ గట్టి షాకిచ్చింది. అమరావతి నుంచి రాజధాని కదలదంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన ప్రకటనను కూడా తీవ్రంగా తప్పుపట్టింది.
అమరావతిలోనే రాజధాని కొనసాగింపుపై ప్రతిపక్ష నేతలవన్నీ మోసపూరిత ప్రకటనలేనని, వాటిని నమ్మొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తిచేసింది. 50 శాతానికిపైగా ఓట్లతో గెలిచిన సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. మోడీ సర్కారు అంగీకరిస్తుందని.. ఇది కేంద్ర ప్రభుత్వం తరఫున.. బీజేపీ అధికార ప్రతినిధిగా తాను చెబుతున్న మాట అని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు.
జగన్ సర్కారు పంపినా ఒకే చేస్తాం..
ఏపీకి రాజధాని అమరావతే అంటూ కేంద్ర హోం శాఖ నోటిఫై చేసిన లేఖ పెనుదుమారానికి దారితీసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. రెండ్రోజుల కిందట వెలుగులోకి వచ్చిన ఆ లేఖ.. 2015 నాటిదని.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించాలంటూ పంపిన జీవోను కేంద్రం నోటిఫై చేసిందని, ఒకవేళ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మరో జీవోను పంపితే.. నిబంధనల ప్రకారం కొత్త రాజధానినీ కేంద్రం గుర్తిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన చాలా విషయాలపై స్పష్టత ఇచ్చారు. జీవీఎల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
అమరావతే శాశ్వత రాజధాని కాదు..
‘‘23 ఏప్రిల్, 2015న చంద్రబాబు ప్రభుత్వం జారీచేసిన జీవోనే కేంద్ర హోం శాఖ నోటిఫై చేసింది. ఈ రోజు వరకు కూడా రాజధాని మార్పులపై కేంద్రానికి సమాచారమేదీ లేదు కాబట్టి.. సహజంగానే అమరావతే రాజధాని అవుతుంది. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీకి సమాధానంగా చెప్పాం. అంతమాత్రాన అమరావతినే రాజధానిగా ఉంచాలనిగానీ, లేదా తరలించొద్దనికానీ కేంద్రం చెప్పలేదు. చంద్రబాబు ఏర్పాటు చేసినంతమాత్రన అమరావతి శాశ్వతరాజధాని అయిపోదు.
మోసకారుల మాటలు నమ్మొద్దు..
అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చూస్తామంటూ కొందరు నేతలు చేస్తున్న ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దు. ఏపీలో రాజధాని వ్యవహారంపై కేంద్రానికి ఎలాంటి అధికారంగానీ, సంబంధంగానీ లేనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపే జీవోను నోటిఫై చేయడం వరకే కేంద్రం బాధ్యత. ఈ విషయాన్ని ఆ నోటిఫికేషన్ లోనూ స్పష్టంగా పేర్కొన్నాం. కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కొన్ని పార్టీలు పుకార్లు ప్రచారం చేస్తున్నాయి. రాజధానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తీర్మానాన్ని పంపినా మోదీ సర్కార్ తప్పకుండా అంగీకరిస్తుంది.
చంద్రబాబు జీవో శిలాశాసనమా?
అమరావతిపై చంద్రబాబు చేసిన జీవో శిలాశాసనం కాదు. లేదంటే అక్బర్ శాసనమూ కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రోజుకు వంద జీవోలిస్తుంది. వాటిలో తమ దగ్గరికొచ్చే జీవోలపై కేంద్రం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుంది. అమరావతిని కేంద్రమే గుర్తించింది కాబట్టి.. ఇక దాన్ని మార్చడానికి వీల్లేదని.. కొత్త రాజధాని లేదా మూడు రాజధానులను కేంద్రం ఒప్పుకోబోదనే వితండవాదనలు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ లోని అంశాలను టీడీపీకి గానీ మరో పార్టీకి గానీ అర్థం కాలేదని భావించలేం.