ఎపి నూతన డీజీపీ నియామకంపై ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్ కు నూతన డీజీపీ నియామకంపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి నియామకం కోసం బుధవారం ఢిల్లీలో జరగాల్సిన యుపిఎస్సి కి కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను కేంద్రం మరోసారి తోసిపుచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నూతన డిజిపిగా ఎంపిక చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో మార్పులను సూచిస్తూ ఆ జాబితాను కేంద్రం వెనక్కి పంపిందని అంటున్నారు. నిబంధనలను అనుసరించి ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్న వారిని ఈ జాబితా నుంచి తొలగించి మళ్లీ నూతన జాబితా పంపాలని కేంద్రం సూచించింది. ప్రస్తుత డీజీపీ సాంబశివరావునే మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగించాలనే ఎపి ప్రభుత్వం ప్రయత్నం మరోసారి తిరస్కరణకు గురైంది.
సాంబశివరావు వైపే ఎపి ప్రభుత్వం మొగ్గు..
తాత్కాలిక డిజిపిగా సుమారు 16 నెలల నుంచి పనిచేస్తున్న ఎపి డిజిపి ఎన్.సాంబశివరావు డిసెంబర్ నెలలో పదవీ విరమణ చెయ్యనున్నారు. అయితే కారణాలేమైనప్పటికి మరోసారి డిజిపి పదవిలో సాంబశివరావునే నియమించాలని ఎపి ప్రభుత్వం భావించింది. అందులోను ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో డిజిపి పదవి పరిపాలనలో కీలకమైనందున ఎపి ప్రభుత్వం సాంబశివరావు ను ఈ పదవిలో నియమించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అదే జరిగితే డిసెంబర్లో రిటైర్ కానున్న సాంబశివరావు మరో రెండేళ్ల పాటు డిజిపిగా కొనసాగే అవకాశం ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఒకసారి పూర్తి స్థాయి డిజిపిగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారి రిటైర్మెంట్ సంబంధం లేకుండా రెండేళ్ల పాటు అదే పదవిలో కొనసాగవచ్చు. అందువల్లే నూతన డిజిపి నియామకం కోసం యుపిఎస్సీకి పంపిన సీనియార్ అధికారుల జాబితాలో ఎపి ప్రభుత్వం సాంబశివరావు పేరును చేర్చి పంపింది. మొత్తం ఆరుగురు పోలీస్ అధికారుల పేర్లతో ఈ జాబితా కేంద్రానికి పంపడం జరిగింది. ఈ జాబితాలోని పేర్లు ఎం.మాలకొండయ్య, ఎన్.సాంబశివరావు,ఆర్.పి.ఠాకూర్,గౌతమ్ సవాంగ్,వినయ్ రంజన్ రే,విఎస్కె కౌముది. వీరిలో ఎం.మాలకొండయ్య, ఎన్.సాంబశివరావు వీరంతా ఆరు నెలల లోపు రిటైర్ కాబోతున్నారు. నిబంధనల ప్రకారం వీరి పేర్లను జాబితాలో చేర్చరాదని కేంద్రం స్పష్టం చేస్తోంది. మిగిలిన వారిలో వినయ్ రంజన్ రే, కౌముది వీరిద్దరూ ఎపి డిజిపిగా వచ్చేందుకు సుముఖత చూపడం లేదని తెలిసింది. జాబితాను అనుసరించి నిబంధనల ప్రకారం చూస్తే జాబితాలో ఆర్.పి.ఠాకూర్, గౌతమ్ సవాంగ్ లలో ఒకరిని డిజిపిగా ప్రభుత్వం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది..
మరోసారి తిరస్కరణతో మరింత సంక్లిష్టం
అయితే ఎపి ప్రభుత్వం సాంబశివరావునే డిజిపి గా కొనసాగించేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష మేరకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లయితే సాంబశివరావు ఈ పదవిని చేపట్టవచ్చు. అప్పుడు డిసెంబర్లో ఆయన పదవి విరమణ చేయాల్సిన అవసరం లేకుండా సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి రెండేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగవచ్చు. అందుకే ఎపి ప్రభుత్వం ఒకసారి జాబితాను కేంద్రం తిరస్కరించినప్పటికి రెండోసారి కూడా అదే జాబితాను పంపింది. అంతేకాకుండా సాంబశివరావును డిజిపిగా ఎంపిక చేసే విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా మాట్లాడినట్లు సమాచారం. అయినప్పటికి కేంద్రం మరోసారి ఆ జాబితాను తిరస్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇలా చేయడం స్ఫూర్తి కి విరుద్ధం..
అయితే డిజిపి నియామకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలను కాదని కేంద్రం వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే డిజిపి ఎంపికలో తమ పాత్ర కూడా ఉండేలా కేంద్రం జాగ్రత్త పడుతున్నట్లు అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన డిజిపి ఎంపిక వ్యవహారంలో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై కొందరు రాష్ట్ర పెద్దలూ అసహనంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల్లో ఇంతలా కేంద్రం జోక్యం చేసుకోవడం సమాఖ్య సూర్తిని ఉల్లంఘించడమేనని రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు డిజిపి పై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో చేసిన ఆలస్యం కూడా ఇప్పుడు ఇబ్బందులకు కారణమని అంటున్నారు.
ఎందుకు ఈ పరిస్థితి?..
మరోవైపు నూతన డిజిపి నియామకం ప్రక్రియ సీనియర్ ఐపిఎస్ల మధ్య చీలికకు కారణమయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పదవిని ఆశిస్తున్న ఉత్తరాది అధికారులు నిబంధనల ప్రకారం డిజిపి నియామకం జరగాలని కోరుకుంటున్నారట. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న తమ ప్రాంతపు అధికారుల ద్వారా కేంద్రంలో కీలక వ్యక్తులకు పరిస్థితి తెలియజెప్పటం,నిబంధనల ప్రకారమే ఈ పదవి భర్తీ అయ్యేలా చూడాలని విన్నవించడం జరిగిందని అంటున్నారు. అందువల్లే ఈ ప్రతిష్టంభన కొనసాగుతోందని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రస్తుత డిజిపి సాంబశివరావుతో పాటు ఎసిబి డిజి ఆర్పీ ఠాకూర్, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్లతో తుది జాబితా ఖరారైందని, త్వరలోనే సమావేశం ఉంటుందని, ఈసారి సమావేశంతో డిజిపి నియామకం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.