విజయవాడ, గుంటూరుకు కేంద్రం రూ. 1000 కోట్లు
హైదరాబాద్: ఏపీలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో తాగునీటి సరఫరా, మురికినీటి పారుదల వ్వవస్ధల అభివృద్ధికి రూ. 1000 కోట్ల మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి కేంద్ర ఆర్ధికశాఖ తుది అనుమతి లభించిన వెంటనే నెలాఖరులోగా నిధులు విడుదల కానున్నాయి.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,800 కోట్లు మిగలగా, వాటిలో రూ. 1000 కోట్లు రాజధాని కోసం ఇచ్చేందుకు ఆశాఖ మంత్రి వెంకయ్య నాయుడి చొరవతో కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్వహించిన ఉన్నతస్ధాయి సమావేశంలో రాజధానిలో నిర్మాణాలకు సరైన నివేదిక లేకుండా నిధులు ఎలా మంజూరు చేస్తారని కేంద్ర ఆర్ధిక శాఖ ప్రశ్నించింది.
దీంతో విజయవాడ, గుంటూరు నగరాల్లో ఇప్పటికే తాగునీటి ప్రతిపాదించిన తాగునీరు, మురికినీటి పారుదల ప్రాజెక్టుల పనులకు సంబంధించిన నివేదికలిస్తామని, ఈ రెండు నగరాలు సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కనుక వాటికి నిధుల మంజారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
దీనికి సంబంధించిన నివేదికలను కొద్ది రోజుల కిందట ఢిల్లీకి చేరాయి. ఈ నివేదికలపై సోమవారం న్యూఢిల్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశ అనంతరం కేంద్రం ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది.