ఏపీ స్థానిక ఎన్నికలపై కేంద్రం సంచలనం.. సీఎం జగన్కు డబుల్ ధమాకా.. టీడీపీకి కొత్త ఆయుధం..
వారం కిందటే ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు రూ.48వేల కోట్ల నిధులు మంజూరు చేసిన కేంద్ర సర్కారు.. స్థానిక ఎన్నికల వాయిదా తర్వాత కూడా మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా మహమ్మరిని నిరోధించడంలో కీలక భూమిక పోషిస్తోన్న కారణంగా.. ఎన్నికలు జరగనప్పటికీ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల్ని మోదీ సర్కారు విడుదల చేసింది. తద్వారా రోజుల వ్యవధిలోనే సీఎం జగన్కు డబుల్ ధమాకా అందినట్లయింది. అదేసమయంలో, ఎన్నికల వాయిదాతో నిధులు రావన్న సీఎంను తూర్పారపట్టేందుకు ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఆయుధమూ దొరికనట్లయింది.
మొదటి విడత నిధులు
రూరల్, అర్బన్ కేటగిరీల్లోని స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఎన్నికలు ఇంకా జరగనప్పటికీ మొదటి విడత నిధుల్ని మంజూరు చేస్తున్నామన్నారు. ఏపీతోపాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ పక్రియలో లబ్ధి పొందనున్నాయి.
ఏయే సంస్థలకు నిధులు
మొత్తంగా ఏపీకి 14వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.5వేల కోట్లు రావాల్సి ఉండగా, శుక్రవారం విడుదలైన మొదటి విడతలో రూ.1,301వేల కోట్లు విడుదలయ్యాయి. ఏ సంస్థకు ఎన్ని నిధులనేది కూడా నిర్మల తన ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీలోని రూరల్ లోకల్ బాడీస్.. అంటే, పంచాయితీ, మండల, జిల్లా పరిషత్ లకు రూ.870.23వేల కోట్లు దక్కగా.. అర్బన్ బాడీలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మరో రూ.431 కోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
నిధుల కొరత కారణంగా ఇబ్బందులు రావొద్దనే..
కరోనా కట్టడికి సంబంధించి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నవి స్థానిక సంస్థలేనని, ప్రస్తుత సంక్షోభ సమయంలో అవి నిధుల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొద్దన్న ఉద్దేశంతోనే... ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనప్పటికీ 14వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చిందని కేంద్ర మంత్రి నిర్మల చెప్పారు. ఎన్నికల వాయిదా అంశం రాష్ట్రంలో దుమారం రేపిన నేపథ్యంలో ఆమె ప్రకటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
టీడీపీ చెప్పినట్టుగానే నిధులు
ఎస్ఈసీగా ఉన్న తన మనిషి నిమ్మగడ్డ ద్వారా స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయించిన చంద్రబాబు.. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ.5వేల కోట్ల(14వ ఆర్థిక సంఘం) నిధుల్ని అడ్డుకున్నాడని సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. అయితే టీడీపీ మాత్రం మొదటి నుంచీ.. స్థానిక ఎన్నికల వాయిదాతో ఫైనాన్స్ కమిషన్ నిధులకు సంబంధం లేదని, అది కేవలం కేంద్రం ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుందని వాదిస్తూ వచ్చింది. కారణం కరోనానే అయినప్పటికీ.. టీడీపీ నేతలు చెప్పినట్టే కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం గమనార్హం. ఈ విషయంలో వైసీపీపై ఎదురుదాడికి టీడీపీ సమాయత్తమవుతున్నది.