ఏపీలో కరోనా విలయం వేళ.. కేంద్రం నుంచి తీపి కబురు.. రెవెన్యూ లోటు పూడ్చుతూ..
ఒక దిక్కు కరోనా విలయతాండవం.. మరోవైపు ఖాళీ అవుతోన్న ఖజానా.. ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్ని కూడా వాయిదా వేసే పరిస్థితి.. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో ఆంధప్రప్రదేశ్కు.. చిన్నదే అయినా.. కేంద్రం నుంచి తీపి కబురు అందింది. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు.. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం తన వంతుగా రూ.491.41 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నెలకుగానూ ఈ నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ భర్తేందు కుమార్ సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీతోపాటు మరో 12 రాష్ట్రాలకూ కలిపి మొత్తం రూ. 6157.74కోట్ల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది. ఇందులో కేరళకు అత్యధికంగా 1276.91 కోట్లు దక్కనున్నాయి. రెవెన్యూ డెఫిసిట్ గ్రాట్ పొందే రాష్ట్రాల జాబితాలో ఏపీ, కేరళతోపాటు అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి.
Recommended Video
ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద కేంద్రం.. రాష్ట్రాలకు..గ్రామీణ స్థానిక సంస్థలు, అర్బన్ లోకల్ బీడీస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రెవెన్యూ లోటు భర్తీ.. ఇలా వేర్వేరుగా నిధులిస్తుంది. ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనప్పటికీ.. కరోనా విలయం పరిస్థితుల దృష్యా రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల నుంచి తొలి విడతగా రూ.1300 కోట్లను కేంద్రం గత నెలలోనే విడుదల చేసింది. ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ కింద మరో రూ.491.41 ఇచ్చింది. ఇది కాకుండా.. కరోనా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో రూ.11వేల కోట్లను శుక్రవారమే విడుదల చేసింది. అందులోనూ రాష్ట్రానికి వాటా దక్కనుంది.