ఎపిలో ఎర్రచందనం, శ్రీ గంధం ఎంత ఉంది?...లెక్కతీస్తున్న కేంద్రం;ఎందుకంటే?
Recommended Video
చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ లోని అటవీ సంపదపై కేంద్రం పరిశోధనలు చేస్తోందా?...ముఖ్యంగా ఇక్కడి ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద గురించి క్షుణ్నంగా ఆరా తీస్తోందా?...అంటే అవుననే ఈ పశ్నకు సమాధానం వచ్చింది...
అయితే కేంద్రం ఏ కారణంతో ఈ వివరాలు తీస్తోంది?...ఎప్పట్నుంచి తీస్తోంది?...అసలెందుకు తీస్తోంది?...అనే అనుమానాలన్నీ వచ్చేస్తున్నాయి కదా! అంతేకాదు ఎపి నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేశారా?...అందుకే కేంద్రం ఇలా చేస్తోందా? అనే డౌట్ కూడా వచ్చేసింది కదా!...ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం కావాలంటే చదివేయండి మరి....
కేంద్రం పరిశోధన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడవుల్లో వృక్ష సంపద పరిస్థితి ఏంటి?...ఎలా ఉంది?...ఇక్కడ అత్యంత విలువైన అటవీ సంపద సురక్షితంగానే ఉందా?...అనే విషయాలపై కేంద్రం పరిశోధన చేస్తున్న విషయం వాస్తవం. అంతేకాదు ఈ రీసెర్చ్ ఏదో హడావుడిగా మొదలు పెట్టేసి ముగించిన బాపతు కూడా కాదు...అలాగే ఈ రీసెర్చి చేస్తోంది కూడా ఆషామాషీ సంస్థ కాదు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు సుమారు ఏడాది క్రితం నుంచి ఎపిలోని అడవుల్లో తమ పరిశోధనలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న విలువైన వృక్షాలను, వృక్షజాతులను ఎలా కాపాడుకోవాలనే అంశాల మీద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏడాది నుంచి చేస్తున్న పరిశోధనలు మే 8 మంగళవారంతో పూర్తయినట్లు తెలిసింది.
కేంద్రం కోరిక...రంగంలోకి బిఎస్ఐ
ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఎపిలోని నల్లమల, శేషాచలం అడవుల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సంపద స్మగ్లర్ల బారినపడి అంతరించిపోయే స్థితికి చేరుకున్న విషయమూ తెలిసిందే. దీంతో ఏ సమస్య గురించి తెలుసుకున్న కేంద్రం పరిష్కారం కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను సంప్రదించింది. ఆంధ్రప్రదేశ్ అడవుల్లోని అరుదైన వృక్షజాతుల స్థితిగతులపై సవివరమైన నివేదిక తమకు అందచేయాలని కోరింది. దీంతో ఈ బాధ్యత చేపట్టిన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా తమ శాస్త్రవేత్తలు డాక్టర్ జె.స్వామి, డాక్టర్ నాగరాజు ిక్కడినేతృత్వంలో పది మంది నిపుణుల బృందాన్ని రాష్ట్రంలోని వృక్షజాతులపై పరిశోధలకు రంగంలోకి దింపింది.
ఏడాది నుంచి...పరిశోధనలు
2017 ఏప్రిల్లో తమ పరిశోధనలు ప్రారంభించిన బిఎస్ఐ సైంటిస్ట్ లు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిలాల్లోని 5,160 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఎనిమిది డివిజన్లలో 3.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విలువైన వృక్షసంపద సంపద గురించి విస్తృతంగా సర్వే చేశారు. కడప జిల్లా అటవీ ప్రాంతం నుంచి తమ రీసెర్చీ ప్రారంభించి కర్నూలు (నల్లమల), కడప (పాలకొండలు, లంకమల), నెల్లూరు, ప్రకాశం (వెలిగొండ), చివరగా చిత్తూరు జిల్లాలోని (శేషాచలం)అడవులను జల్లెడ పట్టి తాము కోరుకున్న వివరాలు సేకరించడం ద్వారా పరిశోధన విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రీసెర్చీలో భాగంగా జీపీఎస్ నావిగేషన్ ఉపయోగించి ప్రతి మొక్కా, చెట్టు, పుట్ట, గడ్డి, రాయి, జీవరాశులు, వన్యప్రాణులు తదిదర వివరాల్నింటినీ కూలంకషంగా పరిశోధించి, పరిశీలించి నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
కొన్ని వివరాలు...మరింత కేర్ ఫుల్ గా
ఈ రీసెర్చ్ లో ప్రత్యేకించి అరుదైన ఎర్రచందనం, శ్రీగంధం తదితర విలువైన వృక్షాల గురించి కొలతలతో సహా వివరాలు నమోదు చేయడం వాటి భౌగోళిక స్థితిగతులు కూడా అధ్యయనం చేసి రికార్డుల్లో పొందుపరిచినట్లు తెలిసింది. అలాగే వీటితో పాటు మరికొన్ని విలువైన,అరుదైన వృక్ష సంపద వివరాలు కూడా అందులో నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ వృక్ష సంపదకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండు ఉండటం వల్లే దేశీయ స్మగ్లర్లు వీటిని భారీ ఎత్తున విదేశాలకు తరలించేస్తున్న విషయం గురించి కూడా బిఎస్ఐ అన్ని కోణాల్లో పరిశోధనలు నిర్వహించినట్లు తెలిసింది. ఇలా ఏడాదిపాటు పరిశోధన చేసి రూపొందించిన ఈ నివేదికను త్వరలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు అందజేయనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
కలకలం...ఏం జరగనుంది?
అయితే రాష్ట్రంలోని వృక్షసంపద పై కేంద్రం ఇంత లోతుగా అధ్యయనం చేయించడం కలకలం రేపుతోంది. కేంద్రం ఏదో ప్రత్యేక సంకల్పంతోనే ఈ పరిశోదన చేయించి ఉండవచ్చనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వెల్లడవుతోంది. పైగా ఈ పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు కూడా తమ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రంలోని అరుదైన వృక్ష సంపదను కాపాడుకోవటానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోనుందని చెబుతుండటం గమనార్హం. అలాగే ఇంతటి విలువైన అటవీ సంపద స్మగ్లింగ్కు గురికాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు కూడా చేయనుందని వెల్లడించినట్లు సమాచారం. అంటే ఈ వృక్ష సంపద అక్రమార్కుల పాలవుతున్న విషయంలో తామే జాగ్రత్త తీసుకోవాలని కేంద్రం భావించడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.