రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీకి కేంద్రం అఫిడవిట్ ... తెలంగాణాకు షాక్ ..ఏపీ వాదనకు సమర్ధన
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై ఎన్జీటీలో విచారణలు జరిగిన విషయం తెలిసిందే . అయితే ఈ పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ నిర్వహించింది. పిటిషనర్ తరపు వాదనలు, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత తీర్పును కూడా రిజర్వ్ చేసింది.ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసు విషయంలో తమ వైఖరి ఏంటో వారం రోజుల్లో తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఎన్జీటీ లో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం .. తెలంగాణాకు షాక్
ఏపీ ప్రభుత్వం 40వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కుల ఎత్తి పోసేలా మార్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని దానివల్ల తెలంగాణాకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణా పిటీషనర్ తరపు న్యాయవాదితో పాటు తెలంగాణా ప్రభుత్వం కూడా వాదిస్తోంది. ఇక ఈ సమయంలో కేంద్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ,రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక ఆ అఫిడవిట్ ద్వారా ఏపీ వాదనను సమర్ధించింది . తెలంగాణా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది .
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమే .. స్పష్టం చేసిన కేంద్రం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమే అని , దానివల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది . లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను సాగునీటిప్రాజెక్ట్ , విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ లుగా పరిగణించలేమని పేర్కొంది. గత ప్రాజెక్ట్ లకు ఫీడర్ గా మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేస్తుందని , అంతే తప్ప దానితో అదనపు ఆయకట్టు సాగుకు అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతుల గురించి కూడా ప్రస్తావిస్తూ ఇది పాత ప్రాజెక్ట్ , అన్నీఅనుమతులు ఉన్నాయని స్పష్టం చేసింది.
నిబంధనల ఉల్లంఘన జరగలేదన్న కేంద్రం .. ఏపీ వాదనకు సమర్ధనగా
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని పేర్కొంది. గతంలోనే ఏపీ ప్రభుత్వం ఎపీలోని తెలుగు గంగ , గాలేరు నగరి సుజల స్రవంతి , శ్రీశైలం కుడి కాల్వలకు గతంలోనే వేర్వేరు అనుమతులు తీసుకున్నారని అఫిడవిట్ లో పేర్కొంది . ఇక తెలుగురాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కృష్ణా నదీ ట్రిబ్యునల్ పని చేస్తుందని , నీటి మీటర్ల ఏర్పాటుకు ఆదేశించిందని , దానిని కేంద్రం పర్యవేక్షిస్తుంది అని కేంద్రం స్పష్టం చేసింది .
రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణాకు నష్టం .. తెలంగాణా సర్కార్ వాదన
తెలంగాణా రాష్ట్రం మాత్రం ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో తెలంగాణాకు నష్టం జరుగుతుందని , ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఇప్పుడున్న దానికన్నా అధికంగా నీటిని తరలించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం లెక్కకు మించి నీటిని వినియోగించుకోవాలని చూస్తుందని ఆరోపిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, సీమలో పది లక్షల ఎకరాలకు అధికంగా నీరందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సుప్రీం ను కూడా ఆశ్రయించింది . అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, ట్రైబ్యునల్ తో ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో వాదనలు వినిపించింది.
Recommended Video
తదుపరి విచారణ వచ్చేనెల మూడో తేదీకి .. కేంద్రం అఫిడవిట్ పరిశీలిస్తున్న ఎన్జీటీ
ఇప్పటికే ఈ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన ఎన్జీటీ తదుపరి విచారణను వచ్చేనెల మూడో తేదీకి వాయిదా వేసింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలిస్తుంది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. ఇక ఇదే సమయంలో మరోమారు తెలంగాణా ప్రభుత్వం కూడా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఎన్జీటీ లో రీ పిటీషన్ వేసింది. విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్న ఎన్జీటీ తెలంగాణా ప్రభుత్వం వేసిన రీ పిటీషన్ ను కూడా విచారణ జరపనుంది.