ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఇక ఆ ఎగుమతులకు అనుమతులు
ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . కొన్నాళ్లుగా దేశంలో ఉల్లి కొరత ఉన్న కారణంగా ఉల్లి ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో దేశంలో పండించిన పంటను ఇండియాలో మాత్రమే వినియోగించుకున్నారు. అంతేకాదు, పండించిన ఉల్లి సరిపోక విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. కేపీ ఉల్లి ఎగుమతికి రైతులు సిద్ధం అంటున్నారు. పంట బాగా పండినట్టు చెప్తున్నారు.
కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతించాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ విజయసాయి
ఇక నేడు కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు. జీరో అవర్లో రైతు సమస్యలపై మాట్లాడిన విజయ సాయి కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక విదేశాల్లో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉందని ఆయన సభ దృష్టికి తీసుకువెళ్ళారు . తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వకపోతే ఉల్లి పాడయ్యే అవకాశం ఉందని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన సభలో పేర్కొన్నారు.
Recommended Video
కేపీ ఉల్లి ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
దీంతో విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉల్లి ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పండించే కేపీ రకం ఉల్లి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతి చేసేందుకు మాత్రమే ఈ ఉల్లిని పండిస్తుంటారు. అయితే, ఎగుమతులపై నిషేధం ఉండటంతో ఉల్లిని ఎగుమతి చేయలేకపోతున్నారు రైతులు . కేపీ రకం ఉల్లిని సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
సంతోషంలో ఉల్లి రైతులు.. ట్విట్టర్ లో మంత్రికి థాంక్స్ చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి
ఇక తాజాగా కేంద్రం ఉల్లి రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించటం, ఎగుమతులకు అనుమతులు ఇవ్వటం పై ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పీయూష్ గోయల్కు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఉల్లి రైతుల సమస్య పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇదే విషయంపై కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, తలారి రంగయ్య తదితరులు పీయూష్ గోయల్ను కలిసిన విజ్ఞప్తి చేశారు. ఇక నేడు మంత్రి సానుకూలంగా స్పందించారు .