ఏపీ సీఎం జగన్ కు కేంద్రం స్నేహ హస్తం .. కలిసి పని చెయ్యటానికి సుముఖంగా ఉందన్న పురంధరేశ్వరి
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. జగన్ కు కేంద్రం స్నేహ హస్తం అందిస్తుందన్న దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్ణయం మారదు అని తేల్చి చెప్పారు.
Recommended Video
హోదా ఇవ్వరు కానీ కలిసి పని చేద్దాం అంటున్న పురంధరేశ్వరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో చంద్రబాబు చేసిన తప్పుని ప్రస్తుత సీఎం జగన్ చేయకూడదు అని కేంద్ర మాజీ మంత్రి ,మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు. అయితే ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి కేంద్రం సుముఖంగా ఉందని ఆమె పేర్కొన్నారు పారిశ్రామిక రాయితీలు హోదా లో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం గా చెప్పిందని పురందరేశ్వరి అన్నారు. అంతేకాకుండా ఏపీలో వలసలు కొనసాగుతాయని పురంధరేశ్వరి పేర్కొన్నారు. బిజెపిలో చేరడానికి అన్ని పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు బిజెపి వైపు ఎట్రాక్ట్ అవుతున్నారని పురందరేశ్వరి పేర్కొన్నారు.
నదీ జలాల విషయంలో సీఎం జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలన్న పురంధరేశ్వరి
మరోవైపు సీఎం కేసీఆర్ తో జగన్ దోస్తానా పై పురందరేశ్వరి వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుతున్నారని అయితే ఏపీ హక్కులకు భంగం కలగకుండా ఉండేవిధంగా నదీ జలాల పంపకాల విషయంలో సీఎం జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలని పురందరేశ్వరి కోరారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పురందరేశ్వరి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టిడిపి ని ఎన్టీఆర్ స్థాపిస్తే ఆయన ఆశయాలకు ,ఆలోచనలకు భిన్నంగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు పురంధరేశ్వరి.
ఒక పక్క ఝలక్ ఇస్తూనే కలిసి పని చేద్దాం అంటున్న పురంధరేశ్వరి
ఓవరాల్ గా చూస్తే జగన్ విషయంలో కేంద్రం సానుకూల దృక్పథంతో ఉందని, కలసి పని చేద్దాం రండి అని ఆహ్వానిస్తోందని పురంధరేశ్వరి పేర్కొంది.
మొత్తానికి విద్యుత్ పీపీఏల విషయంలో కేంద్రం జగన్ కు ఝలక్ ఇస్తున్నా , జగన్ కేంద్రం సూచనలను బేఖాతరు చేస్తున్నా పురంధరేశ్వరి మాత్రం జగన్ తో కలిసి పని చెయ్యటానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పటం గమనార్హం .