కష్టకాలంలో ఏపీ , తెలంగాణా రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం .. జీఎస్టీ పరిహారం విడుదల
కరోనా సంక్షోభంతో పాటుగా, తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడడానికి కేంద్రం సహకారం అందించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రాలకు 18వ విడత జీఎస్టీ పరిహారం కింద నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇరవై మూడు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అదనపు రుణ సౌకర్యాన్ని కూడా కల్పించింది.
ప్రతీ నెలా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ..ఇంటివద్దకే వెళ్లి ఇస్తున్న వాలంటీర్లు..ఖుషీలో అవ్వా,తాతలు
ఏపీ , తెలంగాణా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల
2020 అక్టోబర్ నెల నుండి విడుదల చేస్తున్న జీఎస్టీ పరిహారంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1.04 లక్షల కోట్లకు జీఎస్టీ పరిహారం చేరుకుంది. తాజాగా విడుదల చేసిన జీఎస్టీ పరిహారంలో తెలంగాణకు 86.38 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 83.88 కోట్ల రూపాయలు దక్కాయి. ఇప్పటి వరకూ రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం జిఎస్టి పరిహారంలో నుండి ఏపీకి మొత్తంగా 2306.59 కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్రానికి 2027.33 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తుంది.
ఏపీ తెలంగాణా రాష్ట్రాలకు అదనపు రుణ సౌకర్యం , స్పెషల్ విండో కేటాయింపులు
అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఏపీకి అదనపు రుణ సౌకర్యం కింద 5,051 కోట్ల రూపాయలు, స్పెషల్ విండో ద్వారా 2,306 కోట్ల రూపాయలను ఇవ్వడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక తెలంగాణ రాష్ట్రానికి అదనపు రుణ సౌకర్యం కింద 5,017 కోట్లు కేటాయించగా, స్పెషల్ విండో ద్వారా 2,027 కోట్లు మంజూరు చేయనుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరికి సంబంధించి వసూలైన జీఎస్టీ నిధులు ఇవే
గతేడాది ఫిబ్రవరి తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు శాతం పెరిగాయి. ఇక తెలంగాణ రాష్ట్రం లో ఒక శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది . ఫిబ్రవరి కి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జీఎస్టీ వసూళ్ల లెక్కల ప్రకారం 2020 ఫిబ్రవరి లో ఏపీకి 2563.33 కోట్ల రూపాయలు వసూలు కాగా, ఈసారి 2652.57 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వసూలు చూస్తే 3665 .13 కోట్ల నుంచి 3636.44 కోట్ల రూపాయలకు తగ్గాయి. ఏదేమైనప్పటికీ ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తెలుగు రాష్ట్రాలకు 18 వ విడత జిఎస్టి పరిహారాన్ని కేంద్రం విడుదల చేయడం ఒకింత ఊరటనిచ్చే అంశం.