బాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిధులకు కేంద్రం కొర్రీలు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
టిడిపి అధినేత చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పోలవరాన్ని నిర్లక్ష్యం చేసింది ఎవరో .. పరుగులు పెట్టిస్తోంది ఎవరో ప్రజలకు తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన 2200 కోట్లు ఇవ్వాలని కోరితే ఆర్థిక శాఖ కొత్త అంశం లేవనెత్తింది అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి రెండేళ్లపాటు పోలవరాన్ని పట్టించుకోలేదంటూ విమర్శించారు.
పోలవరం నిర్మాణ బాధ్యతలు చంద్రబాబు ప్యాకేజీల కోసమే
నాడు కేవలం చంద్రబాబు అభ్యర్థన మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్రానికి అప్పజెప్పారు అని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్యాకేజీల కోసమే పోలవరం నిర్మాణ బాధ్యతలను ఆనాడు చంద్రబాబు తీసుకున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈరోజు కేంద్రం కొర్రీలు పెడుతోందని, ఇంత జరుగుతుంటే టిడిపి సిగ్గులేకుండా పోలవరం ప్రాజెక్టు పై మాట్లాడుతోంది అంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
72 సార్లు పోలవరంలో చంద్రబాబు ఏం పరిశీలించారు?
కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ను చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? ప్రతి సోమవారం పోలవరంలో చంద్రబాబు ఏం పరిశీలించారు? పోలవరం ప్రాజెక్టు వల్ల పలు గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఎందుకు ఆలోచించలేదు? పోలవరం వల్ల నిరాశ్రయులైన వారిని గురించి ఎందుకు పట్టించుకోలేదు అంటూ పలు ప్రశ్నలను సంధించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను కచ్చితంగా ఆదుకుంటామని, త్వరలో పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
పోలవరం పై కేంద్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ రాస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. కమీషన్ల కోసం త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు తప్ప కేంద్రం నుండి పెడుతున్న కోర్రీలపై మాట్లాడలేదన్నారు . గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని పేర్కొన్నారు , ఆ తప్పు తాము చేయమంటూ స్పష్టం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం కోసం 72 సార్లు వెళ్లాను అని చెబుతున్న చంద్రబాబు నిర్వాసితుల కోసం వెళ్లారా అంటూ ప్రశ్నించారు.
నాడు టీడీపీ మంత్రులు ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలి
2014లో సవరించిన అంచనాలతో నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారని, కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించలేమని 2017లో స్పష్టం చేసిందని, మరి ఆనాడు టిడిపి మంత్రులు ఎందుకు వ్యతిరేకించలేదు అంటూ మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇంకా టీడీపీ నాయకులకు ఏ మాత్రం సిగ్గు లేకుండా పోలవరం నిర్మాణానికి సీఎం జగన్ ఎంతగా కష్టపడుతున్నా అనవరపు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .