మా ఫస్ట్ ర్యాంక్ ను కేంద్రం అడ్డుకోవాలని చూసింది...విధిలేకే ఇచ్చారు:చంద్రబాబు సంచలనం
Recommended Video
అమరావతి:కేంద్రంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రానికి మొదటి స్థానం రాకుండా కేంద్రం అడ్డుకోవాలని చూసిందని చంద్రబాబు చెప్పారు.
ఉండవల్లిలో ప్రజాదర్బార్ హాలులో గురువారం నిర్వహించిన తెదేపా కార్యశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, ముఖ్యనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని చంద్రబాబు ఈ సమావేశంలో ఏకరువు పెట్టారు.
కేంద్రం...ఏం చేయలేకపోయింది
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రానికి తొలి స్థానం రాకుండా ఎంత అడ్డుకుందామని ప్రయత్నించినా కేంద్రం ఏం చేయలేకపోయింది. అక్కడికీ కొన్ని అంశాలు తొలగించారు. విధిలేని పరిస్థితుల్లోనే మనకు సులభతర వాణిజ్యంలో మొదటిస్థానం ఇచ్చారు. సమర్థమైన, నీతివంతపాలనకు ఇదే నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై లేని నమ్మకాన్ని పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్పై చూపించారు అని టిడిపి మీటింగ్ లో చంద్రబాబు చెప్పారు. అయితే సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి మొదటిస్థానం వచ్చినా మన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలే తేలిగ్గా తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.
ఉక్కు పరిశ్రమ...మీరు కాదంటే మేమే
కర్నూలులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందేనని చంద్రబాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కాదంటే కేంద్రం, రాష్ట్రం- రెండు ప్రభుత్వాలు కలిసి ఈ పరిశ్రమ నెలకొల్పుదామన్నారు. అలా కూడా కూడదంటే దాన్ని మేమే ఏర్పాటు చేస్తాం. పదేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వండి...ఎలా సాధ్యం కాదో చేసి చూపిస్తాం. విశాఖ ఉక్కుతీరునే రైల్వేజోన్ సాధించేదాకా వదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
పోలవరం...అధికారులు ఢిల్లీకి
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,250 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. డీపీఆర్-1లో రూ.470 కోట్లు రావాలని, డీపీఆర్-2 ఇచ్చి ఏడాది గడిచిందని, దానికి చాలా కొరీల్రు వేసినా అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెబుతున్నామన్నారు. ఇంకా కొన్నిటికి సమాధానాలు చెప్పాలని కేంద్ర మంత్రి గడ్కరీ నిన్న అన్నారని చంద్రబాబు తెలిపారు. గడ్కరీ సరేనంటే మా అధికారుల్ని మళ్లీ ఢిల్లీ పంపిస్తా. వారం అక్కడే ఉంటారు. అన్నిటికీ సమాధానాలిస్తారు. వారు చేయలేకపోయారంటే నేనే వస్తా...మొత్తం సచివాలయాన్ని తెస్తా...మీరేం కావాలన్నా అన్నిటికి వివరాలిస్తానని గడ్కరీకి అని స్పష్టం చేశానని చంద్రబాబు వివరించారు.
5 నెలల్లో...100 సభలకు హాజరు
జులై 15 నాటికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1,500 రోజులు అవుతుందని జులై 16 నుంచి గ్రామదర్శిని-గ్రామ వికాసం ద్వారా ప్రజల్లోకి వెళ్దామని చంద్రబాబు నేతలకు చెప్పారు. ‘‘75 నుంచి 100 రోజుల కార్యక్రమం తీసుకుని పనిచేద్దాం. మనం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి? ఈ 1,500 రోజుల్లో ఏం చేశాం.. అనే దానిపై చర్చ జరగాలి. ప్రజలకు అవగాహన కలిగేలా చెప్పాలి. విభజన నష్టాన్ని గుర్తు చేయాలి. వచ్చే అయిదారు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 సభలకు నేను హాజరవుతా. రైతులు, పొదుపు సంఘాల మహిళలు, ఉపాధికల్పన, సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికగా వీటిని నిర్వహిస్తామని చెప్పారు.
ఆరోపణలు...తిప్పికొట్టండి
ప్రత్యర్థులు నోటికొచ్చినట్లు చేసే ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టాలని చంద్రబాబు టిడిపి నాయకులకు పిలుపునిచ్చారు. కుట్రలు, కుతంత్రాలు బయటపెట్టాలి. అలాగే అంటుంటారులే అని ఉపేక్షించవద్దు. ప్రజలు, కార్యకర్తలకు అనుమానం వచ్చే పరిస్థితి రానీయొద్దు...నాయకులతో భేదాభిప్రాయాలు లేకుండా కూర్చోబెట్టి మాట్లాడండి. ఎన్నికల దాకా రాజకీయ విమర్శలే చేయండి...అలాగని మనల్ని మనం విమర్శించుకోకుండా.. అవతలివాళ్ల తప్పుల్ని ఎత్తిచూపండి....అని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.