జగన్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ: తప్పు పట్టిన క్యాట్: ఆ అధికారి సస్పెన్షన్ రద్దు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) బిల్లు ఇప్పటికే హైకోర్టులో నలుగుతున్నాయి. ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో వీగిపోతున్నాయి. అలాంటిదే ఇది కూడా.
Rajya Sabha ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్..!
జాస్తి కృష్ణ కిశోర్ సస్పెన్షన్ను తప్పు పట్టిన క్యాట్..
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ను సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పు పట్టింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర సర్వీసులకు పంపించే వెసలుబాటును కల్పించింది. కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశాన్ని కృష్ణ కిశోర్కు కూడా కల్పించింది. ఈ మేరకు క్యాట్ మంగళవారం ఉదయం తన తీర్పును వెలువరించింది.
చంద్రబాబు హయాంలో నియామకం..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జాస్తి కృష్ణ కిశోర్ రాష్ట్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. అప్పట్లో ఆయనను ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించారు చంద్రబాబు. ప్రభుత్వం మారిపోయిన అనంతరం వైఎస్ జగన్ సర్కార్ ఈడీబీలో చోటు చేసుకున్నట్టుగా అనుమానిస్తోన్న అవకతవకలు, కృష్ణ కిశోర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఆయన వేతనాన్ని కూడా నిలిపివేసింది.
Recommended Video
జగన్ నిర్ణయంపై క్యాట్లో సవాల్
వైఎస్ జగన్ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని కృష్ణ కిశోర్ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తనను సస్పెండ్ చేసిందంటూ పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై దశలవారీగా విచారణను నిర్వహించింది క్యాట్. ఈ నెల 8వ తేదీన తుది విచారణను పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ ఉదయం తీర్పును వెలువరించింది. సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసింది. వేతన బకాయిలను కూడా చెల్లించాలని సూచించింది. కృష్ణ కిశోర్పై వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానాల్లో విచారణ జరిపించుకోవడానికి వీలు కల్పించింది.