కేంద్రానికి కోపం లేదు, అందువల్లే తగ్గింపు: రాయపాటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రానికి ఎలాంటి కోపం లేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలు వ్యతిరేకించడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తగ్గిందని చెప్పారు.
గుంటూరు జిల్లా పల్నాడులో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు రాయపాటి సాంబశివరావు వెల్లడించారు. గురజాల కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని తాను కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు.
క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు- జేఈవో
తిరుపతి: క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు భక్తులకు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా జేఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రధాన కల్యాణకట్టలో తనిఖీలు నిర్వహించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
క్షురకులు సేవాభావంతో పనిచేయాలని జేఈవో హితవు చెప్పారు. తలనీలాలు సమర్పించే భక్తులు క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా అదనంగా శ్రీవారి సేవకులను నియమిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.