పోలవరం:పనుల వేగంపై కేంద్ర బృందం సంతృప్తి...నాణ్యతపై సందేహాలు!
తూర్పుగోదావరి:ఆర్థిక సమస్యలు ఉన్నా పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగానే సాగుతున్నాయని కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఛైర్మన్ వై.కె.శర్మ చెప్పారు. గురువారం ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలించాక ఆయన మీడియాతో మాట్లాడారు.
"ప్రాజెక్టులో అన్ని విభాగాలు చూశాం. ప్రాజెక్టు నాణ్యత, నిర్మాణ ఖచ్చితత్వానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. వాటిపై మరింత శ్రద్ధ చూపాలని మా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను కోరడం జరిగింది. నాణ్యత నియంత్రణ పర్యవేక్షిస్తున్న సీఎస్ఎంఆర్ఎస్ మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. గుర్తించిన లోపాలను సవరిస్తాం. వీటి విషయం పక్కనపెడితే ప్రాజెక్ట్ పనులన్నీ వేగంగానే జరుగుతున్నాయి" అని శర్మ చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాక నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర సర్కారు 'నిపుణుల కమిటీ'ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు పోలవరం పనులను పరిశీలించిన ఈ కమిటీ, ఆయా సందర్భాల్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలు తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ క్రమంలో నాలుగోసారి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరివచ్చిన కేంద్ర జల సంఘం పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ
నేపథ్యంలో
కేంద్రం
నిపుణుల
కమిటీ
గురువారం
ప్రాజెక్ట్
నిర్మాణం
తీరుతెన్నులను
పరిశీలించింది.
కమిటీ
ఛైర్మన్తో
పాటు
కన్వీనర్
పచౌరి,
కేంద్ర
జలసంఘం
డిప్యూటీ
డైరెక్టర్
ఎన్.కె.సింగ్,
ప్రాజెక్టు
అథారిటీ
చీఫ్
ఇంజినీరు
ఎ.కె.ప్రదాన్,
సీఎస్ఎంఆర్ఎస్
శాస్త్రవేత్త
చిత్ర
తదితరులు
ఈ
పరిశీలనా
కార్యక్రమంలో
పాల్గొన్నారు.
అయితే
ఈసారి
పర్యటనలో
వీరు
స్పిల్వే
కాంక్రీటు
పనులు
జరుగుతున్న
చోట
పరిశీలనకు
ఎక్కువ
సమయం
వెచ్చించారు.
ఒకటినుంచి 14వ బ్లాకు వరకు సమగ్రంగా పరిశీలించారు. కాంక్రీటు వేస్తున్న తీరును ట్యాబ్లో చిత్రీకరించారు. గ్యాప్-3 వద్ద చేపట్టే పనులను పరిశీలించారు. పోలవరం స్పిల్వే పనుల్లో సెంట్రింగ్ స్తంభాలు, షట్టరింగుకు సంబంధించిన లోపాలను సరిచేయాలని శర్మ ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిసింది. పోలవరం జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు చేపట్టిన స్పిల్వే పనుల్లో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేసినట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) స్పిల్వే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడాన్ని కేంద్ర నిపుణుల కమిటీ తప్పుబట్టింది. స్పిల్వే పనుల్లో ఉపయోగిస్తున్న సిమెంట్, స్టీల్ నాసిరకంగా ఉన్నాయని తేల్చింది. సెంట్రింగ్(ఇనుప కడ్డీలను వంచడం) పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల కాంక్రీట్ పనుల్లో పటిష్టత ఉండదని పేర్కొంది. దీనిపై ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఛైర్మన్ శర్మ పేర్కొన్నవి చిన్న చిన్న లోపాలేనని, వాటిని సరిదిద్దుతామని తెలిపారు.
అనంతరం గోదావరిపై నిర్మిస్తున్న డయాఫ్రంవాల్, కాఫర్డ్యామ్ పనులు చేపట్టే ప్రదేశాలను పైనుంచి పరిశీలించారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఒడ్డుపైనుంచే చూసిన ఛైర్మన్కు ఎల్అండ్ఎన్టీ బావర్ కంపెనీ ప్రతినిధి హసన్ఆలీ డయాఫ్రంవాల్లో వినియోగించిన యంత్రాల గురించి వివరించారు. వారి వెంట ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు శ్రీధర్, ఈఈలు డి.శ్రీనివాస్, ఎస్వీ సుధాకర్, ఎం రామచంద్రరావు, వెంకరమణ తదితరులున్నారు.
అంతకుముందు జలసంఘం పోలవరంలో ప్రాజెక్టు నమూనాను పరిశీలించింది. ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయో ఇంజినీర్ ఇన్చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు పవర్పాయింటు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం వెచ్చించిన రూ.2600 కోట్లకు పైగా వ్యయానికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉన్నాయని వారితో చెప్పారు. ప్రాజెక్టు పనుల వేగం దృష్ట్యా అడ్వాన్సుగా నిధులిప్పించాలని విన్నవించారు. ఆ విషయం తమ పరిధిలో లేదంటూ కన్వీనర్ పచౌరి బదులివ్వగా... ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు ఆర్థిక విషయాలు కీలకమేనని, మీరు సిఫార్సు చేస్తే కేంద్రం సహకరిస్తుందని ఈఎన్సీ కోరడంతో ఛైర్మన్ శర్మ సానుకూలంగానే స్పందించారు.