నల్లమలలో కలకలం: యురేనియం తవ్వకాలపై కేంద్రం సర్వే: మన్ననూర్ లో అధికారులు మకాం
కర్నూలు: రెండు తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులుగా భావిస్తోన్న నల్లమల అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన యురేనియం తవ్వకాల ప్రతిపాదనలను నిరసిస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయట్లేదు. యురేనియం తవ్వకాలపై ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ పరిధిలో రహస్యంగా సర్వే నిర్వహిస్తోందనే సమాచారం గుప్పుమంది. దావానలంలా వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న అణు ఇంధన సంస్థ ఉద్యోగులు కొందరు నల్లమల అడవుల్లో రహస్యంగా సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయినట్లు సమాచారం. కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ పరిధిలోని మన్ననూర్ సమీపంలో అటవీ శాఖకు చెందిన క్యాంప్ ఆఫీస్ లో మకాం వేశారని, గుట్టు చప్పుడు కాకుండా సర్వే నిర్వహిస్తున్నారనే కలకలం పుట్టిస్తున్నాయి.
అనుమతుల కోసం అటవీ శాఖకు ప్రతిపాదనలను
తెలంగాణలోొని నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను చేపట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర అణ ఇంధన సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించింది కేంద్రం. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నప్పటికీ.. కేంద్రం వెనక్కి తగ్గట్లేదనే విషయం తాజా సర్వేతో తేలిపోయింది. యురేనియం తవ్వకాలకు అవసరమైన అనుమతులను కోరుతూ అణు ఇంధన సంస్థ ఉన్నతాధికారులు తెలంగాణ అటవీశాఖ అధికారులకు కొన్ని ప్రతిపాదనలను పంపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని తెలుస్తోంది. ఒక్కసారి తవ్వకాలకు దిగడమంటూ జరిగితే.. నల్లమల అడవులను నాశనం చేసేంత వరకూ కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు పర్యావరణ వేత్తల నుంచి వ్యక్తమౌతున్నాయి.
నాలుగు వేలకు పైగా బోర్లు..
తవ్వకాల ఫలితంగా పచ్చటి నల్లమల అడవులు, వన్య ప్రాణులతో పాటు బాహ్య ప్రపంచం గురించి పెద్దగా తెలియని చెంచులు, గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకమౌతుందంటూ ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్జోన్ తన అస్తిత్వాన్ని కోల్పోవడం ఖాయమని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. అమ్రాబాద్, దేవరకొండ డివిజన్ పరిధిలోని నల్లమల అటవీ పరిధిలోని నంబాపురం, కంబాలపల్లి, పెద్దగట్టు, పెద్దమూల, శేరిపల్లి, ముదిగొండ గ్రామాలు, నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ బ్లాక్లోని ఉడిమిళ్ల, తిరుమలాపూర్, ఉప్పునూతల గ్రామాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ప్రజాందోళనలను పట్టించుకోకుండా కేంద్ర అణు ఇంధన నల్లమల పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అమ్రాబాద్ పులుల సంరక్షణ పరిధిలో 21వేల ఎకరాల్లో 83 చదరపు కిలోమీటర్ల మేరకు బోర్లు వేయాలని నిర్ణయించింది.
మట్టికొట్టుకుని పోవడం ఖాయం..
తవ్వకాల్లో భాగంగా ఆమ్రాబాద్ పులుల సంరక్షణ జోన్ లో కనీసం నాలుగు వవేల బోర్లు వేయడానికి అనుమతి ఇవ్వాలంటూ అణు ఇంధన సంస్థ ఉన్నతాధికారులు కొద్దిరోజుల కిందట తెలంగాణ అటవీ శాఖ అనుమతిని కోరారు. అటవీ శాఖ నుంచి అనుమతి లభించనప్పటికీ..అణు ఇంధన సంస్థ అధికారులు ప్రతిపాదిత ప్రాంతాల్లో రహస్యంగా సర్వే చేపట్టినట్లు తాజాగా సమాచారం రావడం ప్రకంపనలను పుట్టిస్తోంది. అచ్చంపేట, మన్ననూర్ అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉడిమిళ్ల ప్రాంతంలో నల్లమల అడవుల్లోని చెట్లు, కొండగుట్టలకు ఎరుపు రంగుతో గుర్తులు పెట్టినట్లు గుర్తించారు. ఫలితంగా- ప్రజలను ఏమార్చి, రహస్యంగా కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టినట్లు నిర్ధారించినట్లు చెబుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా- ఆయా చెట్లను తొలగించాల్సి ఉంటుందని, అందుకే ఎరుపురంగు గుర్తులను అతికించినట్లు మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నిరసన ప్రదర్శన..
నల్లమల అడవుల విధ్వంసానికి పాల్పడే ఎలాంటి చర్యలు చేపట్టినా దాన్ని అడ్డుకుంటామని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. సేవ్ నల్లమల పేరుతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభించింది. సేవ్ నల్లమల పేరుతో టాలీవుడ్ నటులు ఉద్యమాన్ని చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి శనివారమే పవన్ కల్యాణ్ ను కోరారు. ఈ మేరకు ఆయన ఫోన్ చేశారు.సోమవారం హైదరాబాద్ వేదికగా ఈ ఉద్యమాన్ని చేపట్టబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.