ఇంగ్లీష్ మీడియంపై కేంద్రం కొర్రీలు- ఎన్ఈపీ, యునెస్కో ఉదాహరణలు-ఏపీలో అమలు కష్టమేనా ?
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారుకు అక్కడా ఊరట దక్కేలా కనిపించడం లేదు. జాతీయ విద్యావిధానం, యునెస్కో విద్యావిధానం ప్రకారం చూసినా ప్రాథమిక స్ధాయిలో మాతృభాష అమలు చేయడమే సరైనదని కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. అదే సమయంలో ఈ కేసులో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని కోరుతూ రాష్ట్రంలో కవులు, తెలుగు భాషావేత్తలు మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ సర్కార్ కు సుప్రీం షాక్: ఇంగ్లిష్ మీడియం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టేఇచ్చేందుకు నిరాకరణ
ఇంగ్లీష్ మీడియం అమలు కోసం..
ఏపీలో ఎట్టిపరిస్ధితుల్లోనూ ఇంగ్లీష్ మీడియం అమలు కోసం వైసీపీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రభుత్వ జీవోలను హైకోర్టు కొట్టేసినా సుప్రీంలో పోరాటం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనందున వీలైతే ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు తెచ్చుకుని అమలు చేసేందుకు రెడీ అంటోఁది. కుదరకపోతే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అయినా ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వారంతా మాతృభాష అయిన తెలుగు అమలు కోసం న్యాయస్ధానాన్ని కోరుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లోనూ ఇదే పేర్కొంది. దీంతో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
తెరపైకి జాతీయ విద్యా విధానం, యునెస్కో సూచనలు
ఇంగ్లీష్ అమలు కోసం ప్రయత్నిస్తున్న ఏపీ సర్కారుకు తాజాగా సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ నిరాశ కలిగించింది. ఇందులో కేంద్రం జాతీయ విద్యావిధానం ప్రకారం చూసినా, యునెస్కో సూచనలను పరిగణలోకి తీసుకున్నా ప్రాథమిక విద్యలో మాతృభాష అమలే ఉత్తమమని తేల్చిచెప్పింది. తాజాగా అమల్లోకి వచ్చిన జాతీయ విద్యావిధానంలో మాతృభాష అమలుకు ఇచ్చిన ప్రాధానాన్ని, 2003లో యునెస్కో ఇచ్చిన నివేదికను కేంద్రం తన కౌంటర్లో జత చేసింది. రాజ్యాంగం ప్రకారం చూసినా భాషా పరమైన మైనార్టీలకు సైతం మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని కేంద్రం గుర్తు చేసింది. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్ధానిక సంస్ధలపైనా ఉందని పేర్కొంది.
తెలుగు కవులు, భాషావేత్తల ఇంప్లీడ్ పిటిషన్...
ప్రాధమిక విద్యలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో తమనూ ఇంప్లీడ్ చేయాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన తెలుగు కవులు, పండితులు, భాషావేత్తలు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, యడ్లపాటి వెంకట్రావు, జొన్నవిత్తుల, వద్దిపర్తి పద్మాకర్ వంటి వారు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు విద్యాహక్కు చట్టం ఉల్లంఘనే అని, ఇంగ్లీష్కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ప్రాచీన భాష అయిన తెలుగుపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. మాతృభాషలో విద్యాబోధన ప్రాముఖ్యం గుర్తించి ఏపీ హైకోర్టు ప్రభుత్వ జీవోలు కొట్టేసిందని వారు గుర్తు చేశారు.
Recommended Video
ఈ ఏడాది కష్టమేనా ?
ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియం అమలు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ ఏడాది మాత్రం ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం కష్టమేనని తెలుస్తోంది. గతంలో ఇచ్చిన జీవోల ఆధారంగా ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను సైతం ఇంగ్లీష్ మీడియంలోనూ అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆన్లైన్లో కొనసాగుతుండటం, మధ్యలో మీడియం మార్చడంలో ఉన్న సమస్యల దృష్ట్యా వచ్చే ఏడాది దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తేనే ఇదంతా జరుగుతుంది. లేకపోతే ఎప్పటిలాగే తెలుగుమీడియం అమలు చేయనుంది.