పోలవరంపై రంగంలోకి వెంకయ్యనాయుడు! కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చేసింది: ఎంపీ హరిబాబు
పోలవరం ప్రాజెక్టు వివాదం పరిష్కారానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. నిర్మాణాలపై తలెత్తిన వివాదాలపై కేంద్రమంత్రి గడ్కరీ బుధవారం ఏపీ బీజేపీ నేతలను పిలిపించి మాట్లాడారు.
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వివాదం పరిష్కారానికి ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. పోలవరం నిర్మాణాలపై తలెత్తిన వివాదాలపై ఇవాళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, అధికారులు బుధవారం ఏపీ బీజేపీ నేతలను పిలిపించి మాట్లాడారు.
ఈ సమావేశం అనంతరం ఎంపీ హరిబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అసలెక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విషయమై నితిన్ గడ్కరీ వివరణ తీసుకున్నారని హరిబాబు చెప్పారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఏపీకి ఎంత ముఖ్యమో, ఆ ప్రాజెక్టు పూర్తి కావాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించినట్లు తెలిపారు. అలాగే పోలవరంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయం కూడా తీసుకున్నామన్నారు.
ఈ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని ఎంపీ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అవశ్యకతను గుర్తించామని, కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందుతుందని ఆయన తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్కు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూరుస్తామని, నెలకోసారి పోలవరం ప్రాజెక్టు పనులు స్వయంగా పరిశీలిస్తామని, 2019కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని గడ్కరీ తమకు చెప్పారని ఎంపీ హరిబాబు మీడియాతో మాట్లాడుతూ వివరించారు.
ప్రస్తుతం నిర్మాణ పనుల కొనసాగింపుకు కావాల్సిన యంత్ర సామగ్రిని గుత్తేదారులు సమకూర్చుకున్నారని, నెల రోజుల్లో పోలవరం పనుల్లో పురోగతి ఉంటుందని, ఇకపై ఎటువంటి ఆటంకాలు ఉండవని గడ్కరీ తమతో చెప్పారని హరిబాబు పేర్కొన్నారు.