Vizag Steel Plant : కేంద్రం పరిశీలనలో ఫైనల్ ఆప్షన్ - ప్రైవేటీకరణ స్ధానంలో విలీనం ?
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో పాటు బీజేపీ కూడా ఇరుకునపడింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇతర విపక్షాలు ఈ వ్యవహారంలో బీజేపీని దోషిగా చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాయి. దీంతో కాషాయ పార్టీకి 2019 ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్ధితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఏపీకి ద్రోహం చేసిందనే కారణంతో రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్లు లేకుండా చేసిన ఓటర్లు.. ఇప్పుడు స్ధానిక పోరులోనూ అదే బాట పడతారన్న భయాలు మొదలయ్యాయి. అంతిమంగా ఈ ప్రభావం బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న తిరుపతి ఉపఎన్నికపైనా పడనుంది. దీంతో ఇప్పుడు కేంద్రం పలు ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు తెుస్తోంది. ఇందులో పదేళ్ల క్రితం పరిశీలించి వదిలేసిన ఓ ఆప్షన్ కూడా తెరపైకి వచ్చింది.
కేంద్రం, బీజేపీకి వైజాగ్ స్టీల్ సెగ
నష్టాల బాటలో ఉన్నాయన్న సాకుతో ఇప్పటికే ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ వంటి ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ రంగ సంస్ధలనే ప్రైవేటీకరించేందుకు వేగంగా పావులు కదుపుతున్న కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే బాట పట్టింది. అయితే ఇతర ప్రభుత్వ రంగ సంస్దల తరహాలో ఇదంత సులువు కాదని ఇప్పుడిప్పుడే బీజేపీకి అర్ధమవుతోంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదన ఇప్పుడిప్పుడే కాస్త గాడిన పడుతున్న కాషాయ పార్టీకి పూర్తిగా పుట్టి ముంచేలా కనిపిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ సాగిస్తోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్పై మరో ట్విస్ట్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో నష్టాల బాటలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇతర ప్రభుత్వ రంగ సంస్ధల్లో విలీనం చేయడమా లేక ఇతర నష్టాల్లో ఉన్న సంస్ధలను ఇందులో విలీనం చేసి తాత్కాలికంగా నష్టాల బాట నుంచి బయటపడేయటమా అన్న ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఉక్కు మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఫైనల్ కావడం ఖాయమన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ప్రైవేటీకరణ స్ధానంలో విలీనం ప్రతిపాదనల పరిశీలన తెరపైకి రావడం కొత్త ట్విస్ట్గా మారింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నీలాంచల్ విలీనం ?
నష్టాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధల్ని గట్టెక్కించేందుకు వాటిని ప్రైవేటీకరించడమే మార్గంగా భావిస్తున్న కేంద్రం.. విశాఖ స్టీల్ విషయంలో మాత్రం అభ్యంతరాలు, నిరసనలతో పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్న కేంద్రం... ఒడిశాలోని సొంత గనులు కలిగిన నీలాంచల్ స్టీల్ ప్లాంట్ను విలీనం చేస్తే ఎలా్ ఉంటుందన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత గనులు ఉన్నప్పటికీ భారీ నష్టాలతో మూతపడిన నీలాంచల్ ప్లాంట్ను వైజాగ్ స్టీల్లో విలీనం చేయడం ద్వారా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయొచ్చని తెలుస్తోంది.
పదేళ్ల క్రితమే నీలాంచల్ విలీనం ప్రతిపాదన
ఒడిశాలోని నీలాంచల్ స్టీల్ ప్లాంట్ (నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) వరుసగా నష్టాల్లో కూరుకుపోతున్నతరుణంలో పదేళ్ల క్రితమే దీన్ని విశాఖ స్టీల్ ప్లాంట్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నీలాంచల్ ఉద్యోగులు సిద్ధమైనా ఒడిశా సర్కారు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా మూతపడింది. ఇప్పటికీ సొంత గనులు కలిగిన నీలాంచల్ ప్లాంట్ను వైజాగ్ స్టీల్లో విలీనం చేయడం ద్వారా కనీసం మరో ఎనిమిదేళ్ల వరకూ ఉక్కు ఖనిజం లోటు లేకుండా విశాఖ ప్లాంట్ నడిపే అవకాశం ఉంటుంది. అయితే నష్టాలతో పాటు భారీగా అప్పులు కూడా ఉన్న నీలాంచల్ ప్లాంట్ను తీసుకుంటే దాని అప్పులు కూడా భరించాల్సి రావడం ఒక్కటే విశాఖ స్టీల్కు మైనస్ కానుంది.
సోము, జీవీఎల్ మాటల అంతరార్ధం అదేనా ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చిన ఓ ట్వీట్ ఆధారంగానే ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. ఓ మంత్రి ప్రకటన కానీ, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు కానీ ఉంటే చూపించమని సోము వీర్రాజు చెప్తుంటే.. వైజాగ్ స్టీల్ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వ్యక్తమవుతున్న నిరసనలతో ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్రం దృష్టిపెట్టిన నేపథ్యంలోనే సోము, జీవీఎల్ ఈ ప్రకటనలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.