సాధ్యం కాదు: ఆస్తుల పంపకం, విశాఖ రైల్వే జోన్పై కేంద్రం
న్యూఢిల్లీ/అమరావతి: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మార్చి 12న జరిగిన రైల్వే శాఖ అధికారుల సమీక్ష సమావేశంలోనే చెప్పారని తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంపై సుప్రీంకోర్టులో శుక్రవారం దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల ఆస్తులను పంచాల్సిన అవసరం లేదంది. ఏపీ పునర్విభజన చట్టంపై ఈ ఏడాది మూడు సార్లు భేటీ అయ్యామని, షెడ్యూల్ 10 ప్రకారం కేంద్ర సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయో.. అక్కడే కొనసాగుతాయని, అంతే తప్ప ఆస్తుల పంపకం చేయమని కేంద్రం తెలిపింది.
షెడ్యూల్ 10 కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో 142 సంస్థలున్నాయని చెప్పింది. అయితే 13వ షెడ్యూల్ కింద ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. పదో షెడ్యూల్లోని ఉన్నత విద్యా మండలి కేసు సందర్భంలో సంస్థల విభజనతో పాటు ఆస్తులు కూడా జనాభా ప్రాతిపదికన పంచాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక ఆస్తులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఏ ప్రాంతంలో ఉంటే, ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలిపింది. ఉద్యోగుల పంపిణీ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయని కూడా తేల్చి చెప్పింది.
కాగా, నూతన మెట్రో విధానానికి అనుగుణంగా ఉంటేనే విజయవాడలో మెట్రోకు ఆమోదం తెలుపుతామని హోంశాఖ స్పష్టంచేసింది. ఇప్పటివరకు రూ.15వేల కోట్ల ఖర్చులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యూసీలు సమర్పిచిందని వెల్లడించింది.
వివిధ శాఖలకు సంబంధించిన 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్లోనే ఉందని, అనేక సంస్థల ఏర్పాటు ఇంకా డీపీఆర్, ఆమోదం దశలోనే ఉన్నాయని వెల్లడించింది. పలు వివాదాస్పద అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదంది. ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే పలు అంశాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని అఫిడవిట్లో తెలిపింది.