జగన్కు కేంద్రం షాక్- దిశ బిల్లు వెనక్కి- కథ మళ్లీ మొదటికి....
తెలంగాణలో గతేడాది దిశ హత్యాచార ఘటన తర్వాత దేశంలో తొలిసారిగా దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఏపీ దిశ బిల్లు 2019ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. మహిళలపై తీవ్రమైన దాడుల ఘటనల్లో సరైన సాక్ష్యాలుంటే 21 రోజుల్లోనే నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం దీన్ని రూపొందించింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకుంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాయి. తమ రాష్ట్రాల్లోనూ ఇవే తరహా చట్టాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అందరి కంటే ముందు ఈ బిల్లు తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వానికి మాత్రం కేంద్రం వద్ద చుక్కెదురైంది.
దిశ బిల్లు తిప్పిపంపిన కేంద్రం..
గతేడాది నవంబర్లో తెలంగాణలో దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, ప్రజలను కదిలించింది. నిందితులపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చివరికి సీపీ సజ్జనార్ టీమ్ నిందితులను ఎన్కౌంటర్ చేసి హతమార్చిన తర్వాత కానీ జనాగ్రహం చల్లారలేదు. దీనిపై అందరి కంటే ముందే స్పందించిన ఏపీలోని జగన్ సర్కారు దిశ పేరుతోనే ఓ చట్టం చేయాలని నిర్ణయించింది. మహిళలపై దాడులకు పాల్పడేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా సరైన సాక్ష్యాధారాలుంటే 21 రోజుల్లోనే చట్ట, న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసి ఉరిశిక్ష విధించేలా ఓ కఠిన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే ఇందుకు ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో చట్టాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపుతూ ఐపీసీ సీఆర్పీసీ మార్పులు చేసి ఈ చట్టాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు కోరింది. అక్కడే చిక్కులు ఎదురయ్యాయి.
దిశ బిల్లులో లోపాలు, అభ్యంతరాలు..
దిశ బిల్లు తీసుకొచ్చిన ఉద్ధేశాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరూ వ్యతిరేకించలేదు. మహిళల భద్రత కోసం ఇలాంటి కఠిన చట్టాలు ఉండాల్సిందే అన్నారు. కానీ బిల్లు రూపకల్పనలో పేర్కొన్న పలు అంశాలు ప్రస్తుతం ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్ధితి లేదు. ప్రస్తుతం దేశంలో ఏ కొత్త చట్టం అమలు చేయాలన్నా, ఇప్పటికే ఉన్న చట్టాలు అమలు చేయాలన్నా వాటికి ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగ నిబంధనల ఆధారంగానే చేయాల్సి ఉంటుంది. కానీ దిశ చట్టం అమలుకు ప్రస్తుతం రాజ్యాంగ నిబంధనల ప్రకారం అవకాశం లేదు. కాబట్టి కేంద్రం తగిన మార్పులు చేస్తే తప్ప దిశ చట్టం అమలుకు నోచుకోలేదు. అక్కడే సమస్య ఎదురైంది. కానీ ఉన్నపళంగా ఈ మార్పులు చేయాలంటే దానికి రాజ్యాంగ సవరణతో పాటు ఎంతో ప్రక్రియ ఉంటుంది. సరైన కసరత్తు చేయకుండా ఆ ప్రక్రియ చేపడితే కేంద్రానికి కూడా ఇబ్బందులు తప్పవు. అందుకే లోపాలను సవరించి దిశ బిల్లును పంపాలని కేంద్రం సూచించింది.
ఏపీ కోసమే నిబంధనల మార్పు
దిశ బిల్లు అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూభాగానికి మాత్రమే వర్తించేలా ఐపీసీలో కొత్తగా 354ఈ, 354ఎఫ్, 354జీ సెక్షన్లను చేర్చింది. ఐపీసీలో చేసే మార్పుల ప్రకారం ఇవి కేవలం ఏపీలో మాత్రమే వర్తింపజేయాల్సి ఉంటుంది. ఇవే ఇప్పుడు దీన్ని చట్టంగా మార్చకుండా అడ్డుపడ్డాయని చెప్పవచ్చు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్న కారణంతో ఐపీసీలో కేవలం ఏపీ వరకే వర్తించేలా సెక్షన్లు మారిస్తే మిగతా రాష్ట్రాలు కూడా భవిష్యత్తులో తమ అవసరాల కొద్దీ మార్పులు కోరవచ్చు. అప్పుడు మొత్తం ఐపీసీ అమలే ప్రశ్నార్ధకంగా మారుతుంది. అంతిమంగా ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి రావచ్చు. అందుకోసమే కేంద్రం ఇలాంటి డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా దిశ బిల్లును తిరస్కరించింది.
Recommended Video
కథ మళ్లీ మొదటికొచ్చింది..
కేంద్రం పలు లోపాలు, అభ్యంతరాలున్నాయంటూ దిశ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపడంతో ఈ బిల్లు చట్టం కావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే గతేడాది ఈ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించినప్పుడే ఇందులో పేర్కొన్న శిక్షలు, ఇతర అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ దిశ హత్యాచారం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లును వ్యతిరేకించేందుకు ఎవరూ ఇష్టపడలేదు. ఈ ముసుగులో పలు అభ్యంతరాలు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు వాటినే కేంద్రం ప్రస్తావించడటంతో తిరిగి వాటిపైనే చర్చ మొదలు కానుంది. అన్నింటికీ మించి కేంద్రం తిరస్కరించిన ఈ బిల్లును తగిన సవరణలు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే కానీ కేంద్రానికి పంపే అవకాశం ఉండదు. అందుకోసం ముసాయిదా సవరణ బిల్లును తీసుకొచ్చి దానికి అసెంబ్లీ ఆమోదం పొంది కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం సంతృప్తి చెందితేనే అది చట్టం అవుతుంది. లేకపోతే మళ్లీ చిక్కులు తప్పవు.