పోలవరం రివర్స్ టెండరింగ్ పై కేంద్రం సీరియస్.. పీపీఏ ను నివేదిక కోరిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సిఈఓ ఆర్కే జైన్ సూచనలు బేఖాతరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. . ఆగస్టు 17 వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు . రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చెప్పినప్పటికీ ఆయన చెప్పిన అంశాలను లెక్క చెయ్యకుండా జగన్ సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో తీసుకున్న నిర్ణయంపై కేంద్రప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేంద్రం , జగన్ సర్కార్ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. కేంద్ర జలశక్తి వనరుల శాఖ, పీపీఏను వెంటనే పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ల విషయం పై పూర్తి నివేదికను కోరింది.
రివర్స్ టెండరింగ్ మంచి కాదని పీపీఏ సమావేశంలో చెప్పిన పీపీఏ సిఈఓ ఆర్కే జైన్
ఒకపక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముందని ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సీఈవో ఆర్ కె జైన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్వహిస్తున్న నవయుగ కంపెనీ పనితీరు కూడా బాగానే ఉన్నట్టు ఆయన మీటింగ్ లో పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం వల్ల పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని, ఖర్చు కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు జైన్. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించడానికి వేసిన నిపుణుల కమిటీకి ఉన్న ప్రాతిపదిక ఏమిటి అని ఆయన జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో ఏకీభవించని సీఈవో జైన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో రివర్స్ టెండరింగ్ విధానం మంచిది కాదని అలా వెళ్తే నష్టం తప్ప లాభం లేదని చెప్పారు.
రీ టెండరింగ్ వద్దని లేఖ రాసిన జైన్.. ఆయన సూచనలు బేఖాతరు చేస్తూ 24 గంటల్లోనే నోటిఫికేషన్
ఇక సమావేశం తర్వాత కూడా ఆయన పోలవరం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చెయ్యాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సమయంలో వద్దని వారిస్తూ పీపీఏ సిఈఓ జైన్ ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారి ఆదిత్యనాథ్ దాస్ కు పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ లేఖ రాశారు ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల మేరకు రీ టెండరింగ్ విధానాన్ని మానుకోవాలని సలహా ఇస్తున్నట్టుగా ఆ లేఖలో పీపీఏ సీఈఓ కోరారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా రివర్స్ టెండరింగ్ విధానాన్ని నిలిపివెయ్యాలని ఆయన లేఖలో కోరారు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. అయినా జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ కు రూ.4,900 కోట్లతో రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.పోలవరం ప్రాజెక్ట్ లో హెడ్స్ వర్క్ మిగిలిన పనులకు రూ.1,800 కోట్లకు, హైడెల్ ప్రాజక్ట్ రూ.3,100 కోట్లకు కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది . ప్రాథమికంగా బెంచ్ మార్క్ కింద రూ.4900 కోట్ల విలువైన పనులకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని చెప్పినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం .. పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని సూచించినా కూడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కేంద్రం చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.తమ సూచనను పట్టించుకోకుంండా 24 గంటల్లోపుగానే రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్ కె జైన్ ను కోరింది. దీంతో జైన్ పీపీఏ సమావేశం వివరాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసు లేఖను కేంద్ర జలమంత్రిత్వశాఖకు పంపారు. అయితే తమ సూచనలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండర్లను ఆహ్వానించిందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో ఈ నెల 19వతేదీ కేంద్ర జలమంత్రిత్వశాఖ అధికారులు పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ తో మాట్లాడారు. కేంద్ర జలమంత్రిత్వశాఖ అధికారులు పోలవరం పనులకు రివర్స్ టెండర్లను ఆహ్వానించడంపై మాట్లాడినట్టుగా పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ మీడియాకు వివరించారు.రెండు రోజుల్లో ఈ విషయమై కేంద్రానికి పూర్తి నివేదిక అందించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిద్దంగా ఉన్నట్టుగా సీఈఓ ఆర్ కె జైన్ ప్రకటించారు. చూడాలి మరి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సీరియస్ గా ఉన్న కేంద్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..