జగన్, కేసీఆర్ కొట్లాట- కేంద్రం చేతుల్లోకి కృష్ణాబోర్డు- కేంద్ర బలగాల భద్రతలో ప్రాజెక్టులు..
ఏపీ విభజన తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాయి. గతంలో కేసీఆర్-చంద్రబాబు, ప్రస్తుతం కేసీఆర్-జగన్ మధ్య ప్రాజెక్టుల విషయంలో ఓ అవగాహన కోసం తీవ్ర ప్రయత్నాలే జరిగాయి. కానీ ఓ దశ దాటిన తర్వాత రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రభుత్వాలు, ప్రయోజనాలంటూ ముఖ్యమంత్రులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, చెప్పకున్న మాటలన్నీ పక్కకెళ్లిపోయాయి. ఒకప్పుడు మనం మనం అన్నీ సెటిల్ చేసుకుందాం అనుకున్న సీఎంలు కాస్తా ఎవరి వాదన వారు వినిపించారు. దీంతో తాజాగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ తర్వాత ఈ వ్యవహారం కేంద్రం చేతుల్లోకి వెళ్లే పరిస్ధితి వచ్చింది.
అపెక్స్ కౌన్సిల్ భేటీ- విజయవాడకు కృష్ణా బోర్డు తరలింపు- 4 అంశాలకు కేసీఆర్, జగన్ ఒకే...
ఏపీ-తెలంగాణ జల వివాదాలు..
ఏపీ, తెలంగాణ మధ్య గతంలో 2015 జూన్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకూ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు కొనసాగిచాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తూ వచ్చాయి. కానీ మధ్యలో ఎవరి స్వప్రయోజనాల కోసం వారు పాకులాడుతూ ఆత్మరక్షణ ధోరణిని ఆశ్రయించాయి. దీంతో ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్తో పాటు తెలంగాణ నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులు వివాదానికి కారణమయ్యాయి. వీటిపై గత ఒప్పందాలను గౌరవించాలని ఇద్దరు సీఎంలు జగన్, కేసీఆర్ భావించినా అది సాధ్యం కాలేదు. కాబట్టి అనివార్యంగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కృష్ణాబోర్డు తీసుకునే నిర్ణయాల ప్రకారమే ముందుకెళ్లేందుకు ముఖ్యమంత్రులు అంగీకరించ తప్పని పరిస్ధితి వచ్చేసింది.
కృష్ణాబోర్డు చేతుల్లోకి ప్రాజెక్టులు..
ఏపీ, తెలంగాణ జలవివాదాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వ్యవహారాన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇక కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా, ఉన్న ప్రాజెక్టు నిర్వహణ చేయాలన్నా, నీటి కేటాయింపులు పెంచుకోవాలన్నా కృష్ణాబోర్డును ఆశ్రయించక తప్పని పరిస్ధితి వచ్చేసింది. దీంతో అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం ప్రభావం రాయలసీమ లిఫ్ట్పై ఎంత ఉండబోతోంది, తెలంగాణ కట్టబోతున్న ఆలంపూర్ పథకంపై ఎంత ఉండబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండూ కొత్త ప్రాజెక్టులే కావడంతో తప్పనిసరిగా వీటి డీపీఆర్లను కృష్ణాబోర్డుకు అప్పగించి బోర్డు నిర్ణయం కోసం ఎదురుచూడాల్సిందే.
కేంద్ర బలగాల భద్రతలో ప్రాజెక్టులు..
తాజాగా కృష్ణాబోర్డు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టేందుకు వీలుగా తయారు చేస్తున్న ముసాయిదా ప్రకారం గతంలో విభజన చట్టంలో సూచించిన విధంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద బోర్డు పర్యవేక్షణ పెరగబోతోంది. నీటి వినియోగం లెక్కలతో పాటు కేంద్ర బలగాల భద్రత కూడా రాబోతోంది. బోర్డు కేటాయింపుల ఆధారంగా నీటి వినియోగం జరుగుతుందా లేదా అనే అంశాన్ని తేల్చేందుకు ప్రాజెక్టుల వద్ద సిబ్బందిని నియమిస్తారు. నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలీమెట్రీ పరికరాలను బిగించి కచ్చితంగా లెక్కింపు చేపడతారు. అలాగే ప్రాజెక్టుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఐఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దించుతారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
Recommended Video
కృష్ణాబోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులివే...
కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటూ నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. దీని ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు, దీని నుంచి నీటిని తీసుకునే ఎత్తిపోతల పథకాలు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్లు, వాటి స్లూయిస్లు, మాధవరెడ్డి ప్రాజెక్టు, ప్రాజెక్టుల స్లూయిస్లు సైతం కృష్ణాబోర్డు పరిధిలోకి రానున్నాయి. అయితే ఇవి కాకుండా వివాదాల్లేని ఇతర ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, జూరాల, సుంకేశుల, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మాత్రం ఆయా రాష్ట్రాలే నిర్వహిస్తాయి. ప్రతీ సీజన్లోనూ నీటి అవసరాలను బోర్డుకు చెబితే ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్లు, సభ్య కార్యదర్శితో కూడిన కృష్ణాబోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.