ఏపికి కేంద్రం తిత్లీ సాయం : రూ. 539.53 కోట్ల మంజూరు..
తిత్లీ తుఫాను కారణంగా ఏపిలో జరిగిన నష్టం పై కేంద్రం స్పందించింది. ఏపి ప్రభుత్వం తిత్లీ తుఫాను కారణంగా దాదాపు మూడు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించింది. కేంద్ర బృందం సైతం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కేంద్రానికి నివేదించింది. అయితే, ఏపి ప్రభుత్వం వద్ద ఉన్న కేంద్ర విపత్తు నిధులను తొలుత వినియోగంచుకోవాలని సూచించింది. తాజాగా, ఏపి ప్రభుత్వానికి రూ. 539.53 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది.
తిత్లీ తుఫాన్తో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చింది. తిత్లీ తుఫాన్తో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిత్లీ తుఫాన్ సాయం కింద ఏపీకి రూ.539.53 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇక, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ. 3050 కోట్ల అదనపు సాయాన్ని అందజేయనుంది.
ఈ మేరకు ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ హైలెవల్ కమిటీ ఆమోదిం చింది. గత అక్టోబర్ నెలలో సంభవించిన తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. జిల్లాలో తుఫాన్ తీవ్రమైన విధ్వంసాన్ని మిగిల్చింది. జిల్లాలోని అనేక చోట్ల తుఫాన్ ధాటికి జనజీవనం అస్తవ్యస్త మైంది. పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
తీత్లి బాధితులు చాలామంది ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీని పై రాజకీయంగానూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం తిత్లీ తుఫాను నష్టం పై పట్టించుకోవటం లేదని..ఏపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం పై ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.