తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ రైళ్లు: నీతి ఆయోగ్ ప్రతిపాదనలకు ఆమోదం: ఐదు రూట్లలో ఖరారు..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేటు రైళ్లు పరిగెత్తనున్నాయి. నీతి అయోగ్ సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లలో డిమాండ్ ఉన్న రూట్లను గుర్తించారు. అందులో అయిదు రూట్లలో మొత్తంగా ఏడు ప్రైవేటు రైళ్లను ఆపరేట్ చేసేందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వంద రైలు మార్గాల్లో 150 ప్రైవేటు ప్యాసింగర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నీతి అయోగ్ ఇప్పటికే కేంద్రానికి సూచనలు చేసింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో అయిదు రూట్లతో నీతి అయోగ్ చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలోని అయిదు రూట్లకు ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు సమాచారం. దీంతో..ఈ నెలలోనే బిడ్లు ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది.
ప్రైవేటు రైళ్లు..ఆధునిక సౌకర్యాలతో
దేశంలోని వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నారు. వీటికి రూ.22,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ 150 రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అయిదు రూట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ప్రైవేట్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించారు. రెండో ప్రైవేట్ రైలు అహ్మదాబాద్-ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లలో విమానాల తరహాలో సౌకర్యాలుంటాయి. రైల్ హోస్టెస్లు ఉంటారు. ప్రైవేటు రైళ్లలో డ్రైవరు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది. ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమా తదితరాలన్నీ చూసుకుంటుంది. మిగిలిన సౌకర్యాలు మొత్తం ప్రైవేటు ఆపరేటర్లదే బాధ్యత.
తెలుగు రాష్ట్రాల్లో అయిదు రూట్లలో..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉన్న రూట్లనే ప్రైవేటు రైళ్లకు ఎంపిక చేశారు. శ్రీకాకుళం నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్లి హైదరాబాద్లోని చర్లపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో ఉంటున్నారు. తిరుపతికి, గుంటూరుకు లింగంపల్లి ప్రాంతం నుంచి ప్రయాణీకుల డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాగే, విశాఖ-విజయవాడ, విశాఖ-తిరుపతి రూట్లలోనూ అదే పరిస్థితి. ఈ మార్గాల్లోని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ రూట్లలో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు. ఇందు కోసం అధికంగా డిమాండ్ ఉన్న రూట్లు..ప్రైవేటు రైళ్లకు అనుమతి ఇస్తే..ఆ రూట్లలో ప్రయాణీకులకు కలిగే ప్రయోజనాలు.. నిర్వహణ తీరు వంటి వాటి మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆమోదం పొందిన అయిదు రూట్లు..
నీతి అయోగ్ ఆమోదించి..కేంద్రానికి నివేదించిన తెలుగు రాష్ట్రాల్లోని అయిదు రూట్లు నిత్యం రద్దీగా ఉండేవే. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కు అనుగుణంగా వీటిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నీతి అయోగ్ ఎంపిక చేసిన అయిదు రూట్లలో.. చర్లపల్లి-శ్రీకాకుళం (డైలీ) .. లింగంపల్లి-తిరుపతి (డైలీ) .. గుంటూరు-లింగంపల్లి (డైలీ) .. విజయవాడ-విశాఖ (ట్రై వీక్లీ) .. విశాఖ-తిరుపతి (ట్రై వీక్లీ) ఉన్నాయి. వీటికి ఈ నెలలోనే బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. బిడ్లు ఖరారు చేసిన తరువాత మార్చి నెలలోగానే ఈ ప్రయివేటు రైళ్లు తెలుగు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.