టీయస్ఆర్టీసీ ఉనికినే ప్రశ్నించేలా: ఏపీయస్ఆర్టీసీ విలీనానికి ఇబ్బందులేనా: కేంద్ర వాదనలతో ఇరకాటం..!
తెలంగాణ ఆర్టీసీ వ్యవహారం ఇప్పుడు ఏపీయస్ ఆర్టీసీ విలీనం పైన ప్రభావం చూపుతుందా. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్త మైంది. న్యాయ పరంగా కొత్త అంశాలు తెర మీదకు వచ్చాయి. అసలు..ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కేంద్రం తరపున న్యాయవాది కోర్టుకు స్పష్టం చేసారు. విభజన ప్రక్రియ పెండింగ్ లో ఉండగా..టీయస్ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది. కొద్ది రోజుల క్రితం టీయస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్దామ రెడ్డి సైతం తాము ఇంకా ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులుగానే ఉన్నామంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కేంద్రం తమ వాటా 33 శాతం ఏపీయస్ ఆర్టీసీలోనే ఉందని కోర్టుకు నివేదించింది. దీని ద్వారా ఇప్పుడు ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ పైన ప్రభావం చూపుతుందా అనే ఉత్కంఠ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ మీద మొదలైన న్యాయపరమైన అభ్యంతరాలు..అనుమానాలు ఏపీయస్ ఆర్టీసీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయనే చర్చ జరుగుతోంది. దీంతో..ఏపీయస్ ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ సాఫీగా సాగుతుందా.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది..
సీఎం జగన్ ఏం చెప్పారు: తెలంగాణ జేఏసీకి మద్దతుగా ఏపీయస్ ఆర్టీసీ: ఏం చేయనున్నారు..!
టీయస్ఆర్టీసీ ఉనికే సవాల్ గా..
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం లో ఈ రోజు హైకోర్టులో జరిగిన వాదనలు కొత్త మలుపు తీసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాము ఆర్టీసీకి బకాయిల విషయంలో దాఖలు చేసిన అఫిడవిట్లు విషయం అలా ఉంచితే..ఇదే విషయంలో కేంద్రం తరపున వాదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు కోర్టుకు నివేదించిన అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి. ఏపీయస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని ఆయనకు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో ఆర్టీసీ రీ ఆర్గనైజేషన్ కు కేంద్రం అనుమతి లేదని స్పష్టం చేసారు. తెలంగాణ ఆర్టీసీకి చట్ట బద్దత లేదని వాదించారు. కేంద్రానికి 33 శాతం వాటా ఏపీయస్ ఆర్టీసీలో ఉందని.. టీయస్ఆర్టీసీకి అది బదిలీ కాదని నివేదించారు. ఇంకా..ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని కేంద్రం తరపు న్యాయవాది వివరించారు. ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఉనికినే ప్రశ్నించేలా కొత్త వాదన తెర మీదకు తీసుకొచ్చారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మీద సైతం ఇది ప్రభావం పడుతుందా అనే చర్చకు కారణమవుతోంది. దీంతో..ఏపీ ప్రభుత్వం కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ పైన ఫోకస్ చేసింది.
షెడ్యూల్ 9 కింద ఆర్టీసీ..రెండు కార్పోరేషన్లు ఏర్పాటు..
రాష్ట్ర విభజన సమయంలో షెడ్యూల్ 9 కింద ఆర్టీసీని చేర్చారు. షీలాబీడీ కమిటీ ఆర్టీసీ విభజన మీద 2015లోనే రెండు రాష్ట్రాల అధికారులతో పలు మార్లు భేటీ అయ్యారు. అయితే, పూర్తి స్థాయిలో విభజన మాత్రం జరగలేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల పరస్పర అంగీకారంతో రెండు కార్పోరేషన్లుగా ప్రాంతాలు..అక్కడి బస్సులు..ఆస్తులకు అనుగుణంగా విభజించుకున్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కొత్తగా టీయస్ఆర్టీసీ ఏర్పాటు చేసుకున్నారని అప్పట్లోనే అధికారులు చెప్పారు. అయితే, హైదరాబాద్ కేంద్రంగా తారనాకలో ఉన్న ఆస్పత్రి..ప్రధాన కార్యాలయం..కళ్యాణ మండపం వంటి వాటి విషయంలో మాత్రం నిర్ణయం జరగలేదు. ఇక, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సైతం ఏర్పడ్డాయి. ఇక, అయిదేళ్ల కాలం తరువాత కేంద్రం ఇప్పుడు అసలు తెలంగాణ ఆర్టీసీకి చట్ట బద్దత లేదని.. ఆర్టీసీ రీ ఆర్గనైజేషన్ కు అనుమతి లేదని కోర్టుకు నివేదించారు. దీని ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఉనికిని ప్రశ్నించటమే కాకుండా.. ఏపీయస్ ఆర్టీసీ మీద పరోక్షంగా ప్రభావం పడే విధంగా కేంద్రం వాదనలు ఉన్నట్లుగా ఏపీ రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కోర్టులో జరిగిన వాదనలు..కోర్టు ఇచ్చే మార్గదర్శకాల అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు.
ఏపీయస్ ఆర్టీసీ మీద ప్రభావం ఉండేనా..
ఈ రోజు జరిగిన వాదనలతో ఏపీ రవాణా శాఖ దీని పైన పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఒక వైపు ఏపీయస్ ఆర్టీసీని సాంకేతికంగా ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశం లేదంటూ..ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి..అందులో భాగస్వాములను చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో కేవలం జీవో ఇచ్చారు. మూడు నెలల తరువాత ఆరు నెలల తరువాతో ఏం జరుగుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా ఏపీ రవాణా మంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో మరింత కసిగా ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదనల పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఏపీ అధికారులు చెబుతున్నారు. కేంద్రం వాట ఏపీయస్ఆర్టీసీలో పేరుకు మాత్రమే ఉందని..లాభ...నష్టాల్లో పంపకాలు సాగటం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యవహారం ఉద్యోగుల విలీన ప్రక్రియ మీద ఏదైనా ప్రభావం చూపుతుందా అనే కోణంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కేంద్రం చెబుతున్నా..ఏపీకి ఆర్టీసీ నుండి కొత్తగా దక్కేవి ఏదీ ఉండదని అంచనా. పెండింగ్ లో ఉన్న ఆస్తుల పంపకాలు మాత్రమే తేలాల్సి ఉంటుంది. అయితే, కోర్టు ఇచ్చే మార్గదర్శకాలు..తుది తీర్పు ఆధారంగా ఏదైనా జరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.