ఎట్టకేలకు కేంద్రం నిధులు: పోలవరానికి రూ.1850 కోట్లు విడుదల: ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్..!
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పలు మార్లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయంబర్స్ చేయాలని కోరారు. అందులో భాగంగా కేంద్రం నుండి రావాల్సిన రూ 5,600 కోట్ల గురించి నివేదించారు. అందులో భాగంగా కేంద్ర ఆర్దిక శాఖ రూ.1850 కోట్ల రీఎంబర్స్మెంట్ నిధులు విడుదలకు ఆమోద ముద్ర వేసింది. ఈ నిధులు త్వరలోనే నాబార్డు ద్వారా ఏపీ ప్రభుత్వానికి జమ కానున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఆర్దిక ఇబ్బందుల్లో కేంద్రం నుండి పోలవరం రీయంబర్స్ మెంట్ నిధుల్లో భాగంగా ఇప్పుడు రూ 1850 కోట్లు రావటం రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ ఇవ్వనుంది. మిగిలిన నిధుల గురించి కేంద్రం మరింత సమాచారం కోరినట్లు తెలుస్తోంది..
పోలవరానికి నిధులు విడుదల..
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మారిన తరువాత ముఖ్యమంత్రి జగన్ పోలవరం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ హాయంలో పని చేసిన కాంట్రాక్టర్లను తప్పించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీని పైన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్ ను మార్చటం..రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని కేంద్రం జలశక్తి మంత్రి షెకావత్ సైతం వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఈ మొత్తం వ్యవహారం పైన కేంద్రం ఆగ్రహం తో ఉందనే ప్రచారం సాగింది.
అయితే,
ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కలిసి పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలు..అదే విధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు రూ 850 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయిందనే విషయాన్ని వివరించారు. అదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు వివరించగా..ఆయన అభినందించారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయం నుండి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పోలవరం నిధుల రీయంబర్స్ మెంట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదలకు కేంద్ర ఆర్దిక శాఖ ఆమోదం తెలిపింది.
రూ. 1850 కోట్ల విడుదల..
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 5,600 కోట్లను విడుదల చేయాని కోరుతూ..పీపీఏ ద్వారా కేంద్రానికి బిల్లులు సమర్పించింది. అయితే, దీనిని ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టిన కేంద్ర ఆర్దిక శాఖలో అందులో రూ.1850 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తంలో కేంద్రం దాదాపు మూడు వేల కోట్ల వరకు విడుదల చేస్తుందని అంచనా వేసారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లుల్లో కేంద్రం కొన్నింటికి వివరణలు కోరినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన తరువాత
దీంతో..తొలుత ఈ రూ. 1850 కోట్లను నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల కానున్నాయి. మిగిలిని మొత్తం విషయంలో కేంద్రం కోరిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అందించిన తరువాత ఆ నిధుల విడుదల మీద కేంద్ర ఆర్దిక శాఖ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే, గత వారమే పోలవరం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కేంద్రం నుండి పోలవరం నిధుల కింద విడుదల అయిన తొలి నిధులు ఇవే.