పోలవరానికి రూ.1400 కోట్లు...మంజూరు చేసిన కేంద్రం
అమరావతి: నిధుల లేమితో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం తాజా నిర్ణయం కొంత ఊరట నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా ఎపి ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం...నాబార్డు ద్వారా రూ. 1400 కోట్ల రూపాయల రుణం మంజూరుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జలవనరుల శాఖకు కేంద్రం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.
అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తరువాత ఎపి ప్రభుత్వం కోరిన విధంగానే మరో రూ. 300 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రెండు విడతల్లో రూ.1000 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయడం గమనార్హం. మంగళవారం అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..."పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరైనా చేతులు పెట్టాలంటే వారి చేతులు కాలిపోతాయే తప్ప...ఎవరూ ఏమీ చేయలేరు...'' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.