ఆ నగలకు వీటికి పోలికే లేదా?... తిరుమల శ్రీవారి ఆభరణాలపై కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్న
న్యూ ఢిల్లీ: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీని కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్నించింది.
శాసనాల్లో ఉన్న నగలకు ప్రస్తుతం అక్కడ ఉన్న నగలకు పోలిక లేదని ఆర్కియాలజీ డైరెక్టర్ తనతో చెప్పినట్లు కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ వెల్లడించారు. వేల కోట్లు ఖర్చుచేసే ప్రభుత్వ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై మధ్యంతర ఉత్తర్వులిచ్చానని...అయితే ప్రభుత్వం జవాబుదారీగా ఉండటానికి తనకు ఉన్న అభ్యంతరాలను చెప్పుకోవచ్చని మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు.
శ్రీవారి ఆభరణాలపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పలు ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు పింక్ వజ్రాన్ని దేశం దాటించారని ఆయన ఆరోపించారు. అయితే రమణదీక్షితులను టీటీడీ కొట్టిపారేసింది. ఆయన ఆరోపణల్లో నిజం లేదని టీటీడీ చైర్మన్ సింఘాల్ తెలిపారు. వజ్రానికి సంబంధించి ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు నోరెత్తకుండా రిటైరయ్యాక విమర్శించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సింఘాల్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రమణ దీక్షితుల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. రమణదీక్షితులు టీటీడీ పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన అర్చకుడిగా తనకు తప్ప వేరొకరికి అవకాశం రాకూడదన్న దురుద్దేశంతో రమణదీక్షితులు వ్యవహరిస్తున్నారని, గతంలో ఆయన అనేక తప్పులు చేశారని రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి ఆరోపిస్తోంది.
అయితే రమణ దీక్షితులు తన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర సమాచార కమిషన్ ను కూడా ఆశ్రయించారు. దీంతో స్పందించిన కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ విషయమై సెప్టెంబర్ 28న తుది విచారణ చేపడుతామని...దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు.